Rohit Sharma : వన్డేల్లో, టెస్టుల్లో రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన తరువాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 15, 2024 / 12:10 PM IST
Rohit Sharma promises no imminent retirement from cricket
Rohit Sharma retirement : టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన తరువాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో టెస్టులు, వన్డేల్లో కొనసాగుతానని టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ వెల్లడించాడు. అయినప్పటికి కూడా అతి త్వరలోనే రోహిత్ వన్డేలకు, టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడి వయసు 37 ఏళ్లు కావడంతో సమయం దగ్గర పడిందని పలువురు వ్యాఖ్యానించారు. కాగా.. వీటిపై ఎట్టకేలకు హిట్మ్యాన్ స్పందించాడు.
ఇప్పట్లో టెస్టులు, వన్డేల నుంచి తప్పుకునేది లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వెకేషన్ కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న రోహిత్ డల్లాస్లో క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వెళ్లాడు. అక్కడ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. మరికొంతకాలం క్రికెట్ ఆడతానని చెప్పాడు. ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రణాళికలు లేవన్నాడు.
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లు కూడా రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత జట్టు ఆడనుందని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించిన సంగతి తెలిసిందే. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్కు దూసుకువెళ్లింది. అయితే.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.
టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రపంచకప్ను అందించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ని అందించి ఘనంగా వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా టెస్టుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ను సాధించిన అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ పై ఓ నిర్ణయానికి రానున్నాడని అంటున్నారు.
టీమ్ఇండియా ఈనెలాఖరున శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. జూలై 27 నుంచి ఈ పర్యటన ఆరంభం కానుంది. కాగా.. ఈ పర్యటనకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్తోనే గంభీర్ టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే.
