Ranji Trophy Title: రంజీ ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర… ఫైనల్లో బెంగాల్పై ఘన విజయం.. సత్తా చాటిన ఉనాద్కత్
కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్ జయదేవ్ ఆటగాడిగానూ సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. అందులో రెండో ఇన్నింగ్సులోనే ఆరు వికెట్లు తీయడం విశేషం
- Narender Thiru
- Published On : February 19, 2023 / 04:02 PM IST
Ranji Trophy Title: రంజీ ట్రోఫీ 2022-23 టైటిల్ విజేతగా నిలిచింది సౌరాష్ట్ర. ఆదివారం కోల్కతా వేదికగా జరిగిన ఫైనల్లో బెంగాల్పై సౌరాష్ట్ర తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలవడం వరుసగా ఇది రెండోసారి. ఇప్పటివరకు సౌరాష్ట్ర నాలుగు రంజీ ట్రోఫీలు గెలుచుకుంది.
కెప్టెన్ జయదేవ్ ఉనాద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కెప్టెన్ జయదేవ్ ఆటగాడిగానూ సత్తా చాటారు. ఫైనల్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి తొమ్మిది వికెట్లు తీశాడు. అందులో రెండో ఇన్నింగ్సులోనే ఆరు వికెట్లు తీయడం విశేషం. ఫైనల్లో భాగంగా ముందుగా బెంగాల్ బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జయదేవ్, మరో బౌలర్ చేతన్ సకారియా తలో మూడు వికెట్లు తీసి, బెంగాల్ను స్వల్ప స్కోరుకే పెవిలియిన్ చేర్చారు.
Delhi-Meerut Expressway: పొగ మంచు కారణంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఢీకొన్న వాహనాలు.. పలువురికి గాయాలు
తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర 404 పరుగులు చేసి, 230 పరుగుల ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగాల్ 241 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 12 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఒక వికెట్ కోల్పోయి, 2.4 ఓవర్లలో 14 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. జయదేవ్ ఉనాద్కత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మరో సౌరాష్ట్ర ఆటగాడు అర్పిత్ వసవాడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. అతడు ఈ టోర్నీలో అత్యధికంగా 907 పరుగులు చేయడం విశేషం.
కెప్టెన్గా జయదేవ్ రంజీ ట్రోఫీ అందుకున్నాడు. నిజానికి అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. కానీ, బీసీసీఐ అనుమతితో తన సౌరాష్ట్ర జట్టు కోసం ఇక్కడే ఉండిపోయాడు. ఫైనల్ చేరిన తన జట్టును గెలిపించడమే ముఖ్యం అనుకున్నాడు. విజయం సాధించాడు.
