Shubman Gill : వన్డే కెప్టెన్గా తొలి విజయం.. శుభ్మన్ గిల్ కామెంట్స్.. హర్షిత్ రాణా మా కోసం..
టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ (Shubman Gill) తొలి విజయాన్ని అందుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : October 25, 2025 / 04:41 PM IST
Shubman Gill Comments after India win the match against Australia in 3rd ODI
Shubman Gill : టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ తొలి విజయాన్ని అందుకున్నాడు. శనివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. గిల్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తరువాత తొలి రెండు వన్డేల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక కెప్టెన్గా తన తొలి వన్డే విజయం తన కెరీర్లో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని శుభ్మన్ గిల్ (Shubman Gill ) చెప్పాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో గెలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ రాణించామని చెప్పుకొచ్చాడు.
ఆసీస్ జట్టు బ్యాటింగ్లో మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికి కూడా భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడం పట్ల స్పందించాడు. ‘వారు మంచి ఆరంభాన్ని పొందారు. అయితే.. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు వారిని వెనక్కి లాగారు. తొలుత స్పిన్నర్లు, ఆ తరువాత పేసర్లు వారిని కట్టడి చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీశారు. ముఖ్యంగా హర్షిత్ రాణా రాణించడం బాగుంది. మిడిల్ ఓవర్లలో చాలా చక్కగా బంతులు వేశాడు. ఇలాంటి వికెట్లపై అలాంటి ఆటగాడు కావాలి. .అని గిల్ అన్నాడు.
ఇక బ్యాటింగ్లో రాణించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. వారిద్దరు జట్టు కోసం గత కొన్నేళ్లుగా ఇదే పని చేస్తున్నారన్నాడు. వారిద్దరూ ఇలా బ్యాటింగ్ చేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నాడు. వారిద్దరు మ్యాచ్ను ముగించిన తీరు బాగుందన్నాడు. ఇక వన్డే కెప్టెన్గా తొలి విజయం పై స్పందిస్తూ ఇది ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందన్నాడు.
Rohit Sharma : మూడో వన్డేలో ఆసీస్ పై రోహిత్ శర్మ సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మాట్ రెన్షా (56; 58 బంతుల్లో 2 ఫోర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం రోహిత్ శర్మ(121 నాటౌట్; 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (74 నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) దంచికొట్టడంతో 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలో అందుకుంది.
