IND vs SL : భారత్తో టీ20 సిరీస్కు ముందు శ్రీలంకకు వరుస షాక్లు.. మరో పేసర్ దూరం..
స్వదేశంలో భారత జట్టుతో సిరీస్ ఆరంభం కాకముందే శ్రీలంకకు వరుసగా షాక్లు తగులుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : July 25, 2024 / 05:34 PM IST
Sri Lanka dealt with another injury blow ahead of T20I series against India
India vs Srilanka : స్వదేశంలో భారత జట్టుతో సిరీస్ ఆరంభం కాకముందే శ్రీలంకకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే చమీర టీ20 సిరీస్కు దూరం కాగా.. ఇప్పుడు యువ ఆటగాడు నువాన్ తుషార సైతం అందుబాటులో ఉండడం లేదు. నెట్స్లో బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది. అతడు నొప్పితో విలవిలలాడాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ నిర్వహించగా చేతి వేలు విరిగినట్లు వైద్యులు చెప్పారు.
దీంతో తుషార సైతం టీ20 సిరీస్కు దూరం అయ్యాడని లంక జట్టు మేనేజర్ మహింద హలంగోడ తెలిపాడు. అతడి స్థానంలో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో తుషార ఉన్నట్లు చెప్పాడు. గత కొంతకాలంగా టీ20 జట్టులో తుషార కీలక ఆటగాడిగా ఉంటూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో సైతం మూడు మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సహా అయిదు వికెట్లు తీశాడు.
మరో పేసర్ చమీర స్థానంలో అసిత ఫెర్మాండోను తీసుకున్నారు. భారత్తో టీ20 సిరీస్కు ముందు తుషార దూరం కావడం లంకకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. టీ20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో వనిందు హసరంగ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చరిత్ అసలంక నాయకత్వంలో లంక జట్టు భారత్తో తలపడనుంది.
భారత్తో టీ20 సిరీస్కు శ్రీలంక జట్టు ఇదే..
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కామిందు మెండిస్, దసున్ షనక, వానిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్మాండో, బినూర ఫెర్నాండో.
