T20 World Cup 2026 Mitchell Marsh comments after Australia lost match to Sri Lanka
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాకు పెద్దగా ఏదీ కలిసి రావడం లేదు. కీలక ఆటగాళ్లు గాయాలతో టోర్నీకి దూరంగా మరికొందరు ఆటగాళ్లు కూడా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికి ఈ మెగాటోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయింది. సోమవారం పల్లెకలె వేదికగా శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్లు మిచెల్ మార్ష్ ( 27 బంతుల్లో 54 పరుగులు ), ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56 పరుగులు) లు అర్థశతకాలు బాదారు. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత మూడు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర రెండు వికెట్లు సాధించాడు. మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కమిందు మెండిస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం పాతుమ్ నిస్సంక (100 నాటౌట్; 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో 182 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. కుశాల్ మెండీస్ (38 బంతుల్లో 51) హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఓటమి తమకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. అయితే.. గెలుపు క్రెడిట్ ఖచ్చితంగా శ్రీలంకకు ఇవ్వాల్సిందేనని, వారు చక్కగా ఆడారని అన్నాడు. ఇక తాము చేసిన స్కోరు పోరాడేందుకు సరిపోతుందని భావించినట్లు తెలిపాడు.
తమకు లభించిన ఆరంభాన్ని చూస్తే.. తాము 20 నుంచి 30 పరుగులు తక్కువగా చేసినట్లుగా చెప్పాడు. లంక బౌలర్లు డెత్ ఓవర్లలలో అద్భుతంగా బంతులు వేసి కట్టడి చేశారన్నాడు. ఇక సూపర్-8 అవకాశాల పై మాట్లాడుతూ.. నిజం చెప్పాంటే ప్రస్తుతం తాము అత్యుత్తమ స్థితిలో లేము అన్న విషయం తెలుసునని చెప్పాడు. తాము చేయాల్సింది అంతా చేశామని, ఇక దేవుడిపైనే భారం అని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ భావోద్వేగంతో నిండిపోయిందని చెప్పుకొచ్చాడు. తాము జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ను చూస్తామని చెప్పాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా ప్రస్తుతం తాము నిరాశలో ఉన్నట్లు తెలిపాడు.
వరుసగా జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఆసీస్ సూపర్-8 కి చేరుకోవాలంటే తమ చివరి మ్యాచ్లో ఒమన్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే.. అంతకన్నా ముందు జింబాబ్వే తాము ఆడే చివరి రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒక్క దాంట్లో జింబాబ్వే గెలిచినా ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్లో ఏకైక బౌలర్..
కాగా.. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పల్లెకల్లె వేదికగా నేడు (మంగళవారం, ఫిబ్రవరి 17న) ఐర్లాండ్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ గెలవాలని ఆసీస్ కోరుకుంటుంది. ఐర్లాండ్ గెలిస్తే ఆసీస్ సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక జింబాబ్వే జట్టు తమ చివరి మ్యాచ్ను శ్రీలంకపై ఆడనుంది.