శుభారంభం: కివీస్ను చిత్తుగా ఓడించిన టీమిండియా
- Subhan Ali Shaik
- Published On : January 23, 2019 / 08:35 AM IST
న్యూజిలాండ్ గడ్డపై భారత్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం బౌలర్ల హవా నడిచినా భారత బ్యాట్స్మెన్ కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించారు. ఛేధనలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 76 పరుగులు చేసిన ధావన్ 6 ఫోర్లు బాది విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మరో ఎండ్లో ఉన్న అంబటి రాయుడు(13) మంచి సహకారమందించగా తొలి వన్డేను భారత్ కైవసం చేసుకుంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చి 45పరుగుల వద్ద ఫెర్యూసన్ బౌలింగ్లో లాథమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోసారి విఫలమైన రోహిత్ శర్మ (11) పరుగులతో సరిపెట్టుకున్నాడు. షమీ (3), చాహల్ (2), కుల్దీప్ యాదవ్ (4), కేదర్ జాదవ్ (1)వికెట్లు తీయగలిగారు. అంతకంటేముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ అతి కష్టంపై కేవలం 157 పరుగులు సాధించి ఆలౌట్ అయింది.
Clinical. #TeamIndia start off the series with a 8-wicket win against New Zealand in the 1st ODI. 1-0 ???? #NZvIND pic.twitter.com/P4lLKjoCvu
— BCCI (@BCCI) January 23, 2019
ఓపెనర్లు గప్తిల్, మన్రో ఇద్దరూ ఆరంభంలోనే తడబడ్డారు. ఈ రెండు వికెట్లూ ఫేసర్ షమీకే దక్కడం విశేషం. రెండో ఓవర్ ఐదో బంతికి గప్తిల్ (5) ఔటవగా.. నాలుగో ఓవర్ మూడో బంతికి మన్రో (8) వెనుదిరిగాడు. ఆ తర్వాత చాహల్ వేసిన 15వ ఓవర్లో రాస్ టేలర్ (24) అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ విలియమ్సన్, టేలర్ మూడో వికెట్కు 34 పరుగులు జోడించారు. టేలర్ స్థానంలో బరిలోకి దిగిన లాథమ్ (11)పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఈ వికెట్ కూడా చాహల్ క్యాచ్ & బౌల్డ్గా దక్కించుకోవడం విశేషం. 23 ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదో వికెట్ను చేజార్చుకుంది. కేదర్ జాదవ్ బౌలింగ్లో కుల్దీప్ క్యాచ్ అందుకోవడంతో నికోలస్(12)అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ శాంతర్(14), బ్రాస్వెల్(7), ఫెర్గ్యూసన్(0), ట్రెంట్ బౌల్డ్(1)టిమ్ సౌథీ(9) నాటౌట్తో ముగించారు.
ఎండతీవ్రతకు నిలిచిపోయిన మ్యాచ్:
వెలుతురు తక్కువగానో, వర్షం కారణంగానో కాదు ఎండ తీవ్రత కూడా మ్యాచ్ను ఆపేయగలదని మరోసారి ఋజువైంది. నేపియర్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఎండ నేరుగా బ్యాట్స్మన్ కంటి మీద పడుతుండటంతో బంతి కనిపించడం లేదని మ్యాచ్ను ఆపారు. చేధనకు దిగిన టీమిండియాలో 9.2 ఓవర్లో రోహిత్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్న కోహ్లీ, ధావన్లు ఎండ తీవ్రతకు సతమతమైయ్యారు. న్యూజిలాండ్లోని మైదానాలు దాదాపు ఉత్తర-దక్షిణ ముఖాలను కలిగి ఉంటాయి. కేవలం మెక్ లీన్ పార్క్ మాత్రమే తూర్పు-పడమర అభిముఖంగా ఉండడం దాని ప్రత్యేకత.
