India vs Afghanistan : వచ్చే మ్యాచ్‌లో వారిని పక్కన పెడతాం.. భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు..

India vs Afghanistan : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్ చేశారు.

Shreyas Iyer

India vs Afghanistan : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య భారత్ వేదికగా జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read : IND vs AFG : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ గెలిచిన భార‌త్‌.. అఫ్గాన్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది. హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 14.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టీ20లో పరుగులు రాబట్టడంలో విఫలమైన సంజూ శాంసన్.. రెండో టీ20 మ్యాచ్‌లో రాణించాడు. 22 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 39 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ (38 నాటౌట్) రాణించాడు.

అఫ్గానిస్థాన్ జట్టుపై విజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక కామెంట్స్ చేశాడు. జట్టు వరుసగా మెరుగైన ప్రదర్శన చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. గత మ్యాచ్‌లో ప్రదర్శన తర్వాత ఈ మ్యాచ్‌లో సమగ్ర విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్యాన్ని జట్టు సమర్థంగా అందుకుందని పేర్కొన్నాడు. ఆటగాళ్లంతా తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతో అనుకున్న ఫలితం సాధ్యమైందని వివరించాడు. కెప్టెన్సీ ప్రారంభంలో ఎదురైన కఠిన పరిస్థితుల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు. గతంలో ఏం జరిగిందనే దానిపై ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడమే ముఖ్యమని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు. పరిస్థితులను ఎంతగా స్వీకరిస్తే అంత మెరుగ్గా ముందుకు వెళ్లగలుగుతామని చెప్పాడు.

ఇక తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు కాంబినేషన్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయాస్ అయ్యర్ సంకేతాలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆడే అవకాశం రాని ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు. వారంతా వికెట్, అక్కడి పరిస్థితులకు అలవాటు పడటంతోపాటు మ్యాచ్ ప్రాక్టీస్ పొందాల్సిన అవసరం ఉందని వివరించాడు. అందుకే తదుపరి మ్యాచ్‌‌ ఆ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు మంచి వేదికగా ఉంటుందని అయ్యర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్లను వచ్చే మ్యాచ్‌లో పక్కకు పెట్టే అవకాశం ఉందని తెలిపాడు. అదే సమయంలో జట్టు కాంబినేషన్‌లోనూ స్వల్ప మార్పులు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదగాలని కోరుకున్నాను. అందుకోసం బౌలింగ్‌లో అదనపు వేగం ఉండాలని భావించాను. ఇప్పుడు ఆ వేగాన్ని సాధిస్తున్నాను. ప్రతి విషయంలోనూ ఇబ్బందులు, సంతోషాలు ఉంటాయి. తరచూ గాయపడకుండా ఉండేందుకు, పూర్తి ఫిట్‌నెస్‌తో కొనసాగేందుకు నేను కష్టపడుతున్నానని తెలిపాడు. తొలి టీ20 తరువాత బంతితో ఈ ప్రదర్శన ఎంత సంతృప్తినిచ్చింది అని ప్రశ్నించగా..? మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచడం, తిరిగి పుంజుకోవడం అన్నదే ముఖ్యమని నేను చెబుతానని నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. నేను నన్నునేను నమ్ముతూ ముందుకు సాగాను. క్రికెట్ అనేది చాలా విచిత్రమైన ఆట. ఒక్క క్షణంలో ఏదైనా మారిపోవచ్చు అంటూ నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.