లంచ్ విరామానికి భారత్ స్కోరు 77/1: రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ

  • Publish Date - October 10, 2019 / 06:47 AM IST

విశాఖ టెస్ట్ లో విజయంతో ఊపు మీద ఉన్న టీమిండియా రెండవ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో పోరాటానికి సిద్ధం అయ్యింది. పూణెలో ఉదయం మొదలైన టెస్ట్ లో టీమిండియా ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు. రెండ‌వ టెస్టులో భార‌త్ భోజ‌న విరామ స‌మ‌యానికి 25 ఓవర్లు అయిపోగా వికెట్ న‌ష్ట‌పోయి 77పరుగులు చేసింది.

ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 34 పరుగులతో, పుజారా 19పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మ‌రో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 14పరుగులు చేసి అవుటయ్యాడు. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి టెస్టులో సెంచ‌రీల‌తో హోరెత్తించిన రోహిత్ ఈ మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ 10వ ఓవర్ లో వేసిన చివరి బంతిని ఆడబోయి రోహిత్ శర్మ(14) డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

మరోవైపు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఇది 50వ టెస్టు కాగా కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీ(49) రికార్డుని కోహ్లీ అధిగమించాడు. 60 టెస్టులతో ఈ లిస్ట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. భారత జట్టు సొంతగడ్డపై 2013 నుంచి 30 టెస్టులు ఆడితే 24 గెలిచి ఒకే ఒక్క టెస్టులో ఓడిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ లో గెలుస్తామని ధీమాగా ఉంది టీమిండియా.