Team India Cricketers: టీమిండియాలో ఆ ఐదుగురి ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనా..
టీమిండియా జట్టులో చోటుదక్కించుకోవాలని ఉవిళ్లూరే ఆటగాళ్ల సంఖ్య భారీగానే ఉంది. దీంతో సెలెక్టర్లు అవకాశాన్నిబట్టి నూతన క్రికెటర్లను తుదిజట్టులోకి ఎంపిక చేస్తున్నారు. యువక్రికెటర్ల నుంచి పోటీ విపరీతంగా ఉండటంతో.. సంవత్సర కాలంగా జట్టులో వరుసగా అవకాశాలురాని క్రికెటర్లు, 35ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. ఇలాంటివారిలో టీమిండియాలో ప్రముఖంగా ఐదుగురు క్రికెటర్లు ఉన్నారు.
- Harishth Thanniru
- Published On : January 17, 2023 / 11:16 AM IST
India cricket Team
Team India Cricketers: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా బలమైన జట్టుగా కొనసాగుతోంది. భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు పరుగు వరద పారిస్తున్నారు. మరోవైపు యువకులు వేగంగా జట్టులోకి దూసుకొస్తున్నారు. శుభ్మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్తో పాటు బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ వంటి యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. జట్టులోకి కొత్తగా చేరే ఆటగాళ్ల క్యూ భారీగానే ఉంది. అవకాశాన్ని బట్టి సెలెక్టర్లు నూతన క్రికెటర్లకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో జట్టులో వరుసగా అవకాశాలురాని క్రికెటర్లు, 35ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. ఇలాంటివారిలో టీమిండియాలో ప్రముఖంగా ఐదుగురు క్రికెటర్లు ఉన్నారు. వారిలో మనీష్ పాండే, ఇషాంత్ శర్మ, అజింక్య రహానే, వృద్ధిమాన్ సాహా, కరుణ్ నాయర్లు ఉన్నారు.
ishant sharma
టీమిండియా ప్రముఖ బౌలర్ ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసే విధంగా ఉంది. ఒకప్పుడు భారత్ బౌలింగ్ విభాగంలో ఇషాంత్ కీలక వ్యక్తి. గత ఏడాదిన్న కాలంగా అతనికి జట్టులో మూడు ఫార్మాట్లలోనూ అవకాశం దక్కలేదు. ఇషాంత్ మొత్తం 105 టెస్టులు ఆడి 311 వికెట్లు తీశారు. 80 వన్డేల్లో 115, టీ20 ఫార్మాట్లో 14 మ్యాచ్లు ఆడిన ఇషాంత్ ఎనిమిది వికెట్లు తీశారు. 2021 నవంబర్లో న్యూజిలాండ్తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఇషాంత్కు 34ఏళ్లు. మళ్లీ జట్టులోకి తిరిగివచ్చే అవకాశాలు తక్కువే.
Manish Pandey
టీమిండియా ఆటగాడు మనీష్ పాండే అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లుగా కనిపిస్తుంది. 2015లో జింబాబ్వేపై వన్డే, టీ20 అరంగేట్రం చేసిన మనీష్ కు ప్రస్తుతం 33ఏళ్లు. ఆయన భారత్ తరఫున 29 వన్డేల్లో 566 పరుగులు, 39 టీ20 మ్యాచుల్లో 709 పరుగులు చేశాడు. మనీష్ పాండే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను 23 జూలై 2021 న శ్రీలంకతో ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్ల పోటీని బట్టిచూస్తే మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టంగానే ఉంది.
Ajinkya Rahane
టీమిండియాలో మరో రాహుల్ ద్రవిడ్గా పేరుతెచ్చుకున్న ఆటగాడు అజింక్య రహానే. అన్ని ఫార్మాట్లలోనూ మంచి రికార్డే ఉంది. భారత్ తరపున 82 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ లు ఆడాడు. గత ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో రహానే తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. రహానే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో ఐదు రంజీ మ్యాచ్ లలో 76 సగటుతో 532 పరుగులు చేశాడు. అయినప్పటికీ సమీప భవిష్యత్తులో భారత్ జట్టులో చేరడం కష్టంగానే మారింది. దీంతో రెహానే అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనన్న వాదన మాజీల నుంచి వినిపిస్తుంది.
Vriddhi Man Saha
ధోనీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తరువాత వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్గా చాలా అవకాశాలను దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ జట్టులోకి రావటంతో సాహా అవకాశాలు తగ్గాయి. 2021లో న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడాడు. 40 టెస్టులు ఆడిన సాహా 1,353 పరుగులు చేశాడు. వన్డేల్లో తొమ్మిది మ్యాచ్లుఆడి కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. సాహా వయస్సు 38ఏళ్లు. దీంతో అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని చెప్పొచ్చు.
Karun Nair
కరుణ్ నాయర్. టెస్ట్ క్రికెట్ లో సెహ్వాగ్ మినహా ట్రిపుల్ సెంచరీ చేసింది కరుణ్ నాయర్ మాత్రమే. చివరిసారిగా 2017లో భారత్ తరపున మ్యాచ్ ఆడాడు. 31ఏళ్ల కరుణ నాయర్ భారత్ తరపున ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు మరోసారి నాయర్ కు తుదిజట్టులో అవకాశం దక్కడం దాదాపు కష్టమేనని చెప్పొచ్చు.
