Team India : భారత్ అంటే చాలు రెచ్చిపోయి ఆడే ఆటగాళ్లు ఎవరో తెలుసా..?
కొందరు క్రికెటర్లు ఫామ్లో లేకపోయినా సరే ప్రత్యేకంగా ఓ ప్రత్యర్థి జట్టు పై మ్యాచ్ అంటే చాలు పూనకాలు వచ్చినట్లు ఆడేస్తారు.
- Thota Vamshi Kumar
- Published On : December 29, 2023 / 05:23 PM IST
These players played well against india
Team India : కొందరు క్రికెటర్లు ఫామ్లో లేకపోయినా సరే ప్రత్యేకంగా ఓ ప్రత్యర్థి జట్టు పై మ్యాచ్ అంటే చాలు పూనకాలు వచ్చినట్లు ఆడేస్తారు. భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లు ఆస్ట్రేలియా అంటే చాలు ప్రత్యేకమైన ఇన్నింగ్స్లు ఆడేవారు. ఇలాంటి ప్రత్యేకమైన ఆటగాడే దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్. అతడు టీమ్ఇండియాతో మ్యాచ్ అంటే చాలు పరుగుల వరద పారించేస్తుంటాడు. గత పర్యటనలో గానీ, ప్రస్తుత పర్యటనలో గానీ అతడు భారత విజయాలకు అడ్డుగోడలా నిలబడుతున్నాడు.
ఇండియాతో టెస్టు సిరీస్ అనంతరం రిటైర్మెంట్ అవుతున్నట్లు సిరీస్కు ముందే ప్రకటించాడు డీన్ ఎల్గర్. ఈ క్రమంలో తన చివరి సిరీస్ను చిరస్మణీయం చేసుకుంటున్నాడు. మొదటి టెస్టు మ్యాచులో తృటిలో డబుల్ శతకాన్ని కోల్పోయాడు. బ్యాటింగ్కు కష్టతరమైన పిచ్ పై 185 పరుగులు చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. భారత్ను రెండు సార్లు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
0-1తో వెనకబడ్డా..
విరాట్ కోహ్లీ సారథ్యంలో 2022లో భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్లో మొదటి మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచిన సౌతాఫ్రికా సిరీస్ను 2-1తో గెలుచుకుంది. ఈ విజయాల్లో అప్పుడు కెప్టెన్గా వ్యవహరించిన డీన్ ఎల్గర్ కీలక పాత్ర పోషించాడు. రెండో టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా గెలవాలంటే 240 పరుగులు చేయాలి. టీమ్ఇండియా బౌలర్లు మంచి జోరుమీదున్నారు.
ఓ వైపు మిగిలిన వారు భారత బౌలర్లను ఆడేందుకు ఇబ్బంది పడుతుండగా ఎల్గర్ మాత్రం చక్కటి బ్యాటింగ్ చేశాడు. అద్భుమైన ఫుట్వర్క్, నాణ్యమైన డిఫెన్స్తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 96 పరుగులతో అజేయంగా నిలిచి భారత గెలుపును దూరం చేశాడు. ఇప్పుడు 2023 లో సైతం అదే విధంగా చేశాడు. సఫారీలను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలని భావించిన భారత ఆశలపై ఎల్గర్ నీళ్లు చల్లాడు. భారీ సెంచరీ చేశాడు.
AUS vs PAK: గెలవడమే మరిచిపోయిన పాకిస్తాన్..! 1999 నుంచి వరుసగా 16వ టెస్టు మ్యాచులో ఓటమి..
ఎల్గర్ కేవలం సొంత గడ్డపై జరిగే సిరీస్ల్లోనే భారత్పై రాణిస్తాడు అని అనుకుంటే పొరబాటే అవుతుంది. భారత్లోనూ అతడికి చక్కటి రికార్డు ఉంది. విశాఖ వేదికగా 2019లో జరిగిన ఓ టెస్టు మ్యాచులో పిచ్ స్పిన్కు సహకరిస్తుండగా రవిచంద్రన్ అశ్విన్, జడేజాలను ఎదుర్కొంటూ 160 పరుగులు చేయడం గమనార్హం.
ఎల్గర్ లాగా.. భారత్ అంటే రెచ్చిపోయే ఇంకొందరు ఆటగాళ్లు..
దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ మాత్రమే కాదు. భారత్ అనగానే రెచ్చిపోయే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వారిలో ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, వెస్టిండీస్కు చెందిన శివ్ నారాయణ్ చంద్రపాల్, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య లు కూడా భారత్తో మ్యాచ్ అంటే చాలు అప్పటి వరకు ఫామ్లో లేక తంటాలు పడిన ఆటగాళ్లు కూడా రెచ్చిపోయి ఆడతారు.
