IND vs PAK : పాకిస్తాన్తో మ్యాచ్.. వరల్డ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ భారీ రికార్డును సాధించే అవకాశం ఉంది.
- Thota Vamshi Kumar
- Published On : February 21, 2025 / 12:34 PM IST
Virat Kohli eye on Sachin world record
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఆదివారం పాక్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ గనుక 15 పరుగులు సాధిస్తే చాలు వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 298 వన్డేలు ఆడాడు. 286 ఇన్నింగ్స్ల్లో 57.8 సగటుతో 13985 పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ 14వేల పరుగుల మైలురాయిని 350 వన్డే ఇన్నింగ్స్ల్లో చేరుకున్నాడు. పాక్తో మ్యాచ్లో కోహ్లీ 15 పరుగులు చేస్తే 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధిస్తాడు.
ఇక వన్డేల్లో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే 14వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ జాబితాలో 18,426 రన్స్తో సచిన్ అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఈ జాబితాలో మూడో ఆటగాడు కానున్నాడు.
వన్డేల్లో 14000+రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 18,426 పరుగులు
కుమార సంగక్కర (శ్రీలంక) – 14, 234 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా బోణీ కొట్టింది. గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఓ మోస్తరుగా రాణించాడు. 38 బంతులు ఎదుర్కొని ఒక్క ఫోర్ బాది 22 పరుగులు చేశాడు. రిషద్ హొస్సేన్ బౌలింగ్లో సౌమ్య సర్కార్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ పెవిలియన్కు చేరుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాక్తో మ్యాచ్లో కోహ్లీ 14 వేల పరుగుల మైలురాయిని చేరుకోవాలని, ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్ను మార్చి 2న ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. బంగ్లా పై విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
