Virender Sehwag respond on Pakistan T20 World Cup 2026 Semi Final chances
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శనివారం పల్లెకెలె వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తే పాకిస్థాన్ సెమీఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. లేదంటే న్యూజిలాండ్ జట్టు సెమీస్లో అడుగుపెట్టనుంది. కాగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ సెమీఫైనల్ చేరుకోదని టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
లంకతో మ్యాచ్లో పాక్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల తేడాతో, అదే లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే.. 14.1 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడే కివీస్ కంటే మెరుగైన నెట్రన్రేటును పాక్ సొంతం చేసుకుని సెమీస్లో అడుగుపెడుతుంది. అయితే.. పాక్ ఇలా గెలవడం కష్టమని సెహ్వాగ్ అన్నాడు.
‘పాక్కు ఇది అంత సులువు కాదు. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు గెలవాలనే వారి (పాక్) ప్రార్థనలు ఫలించి ఉండవచ్చు. అయితే.. శ్రీలంకతో మ్యాచ్లో భారీ తేడాతో తాము గెలవాలనే వారి ప్రార్థనలు ఫలించవు. వారు ఎంతోకాలంగా ప్రార్థిస్తున్నప్పటికి అలా జరగడం లేదు. కాబట్టి వారు సెమీస్ చేరడం అసాధ్యం అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైన అద్భుతం జరిగి సెమీస్కు అర్హత సాధిస్తే మంచిదే. ‘అని సెహ్వాగ్ క్రిక్బజ్ చర్చలో అన్నాడు.
‘పాక్ తొలుత బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల కంటే ఎక్కువ రన్స్తో గెలవడం జరగదు. ఒకవేళ 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 14.1 ఓవర్లలోనే ఛేదించడం కూడా కష్టమే. ఒకవేళ ఇలా జరగాలంటే శ్రీలంక జట్టు చాలా పేలవమైన క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. అయితే.. శ్రీలంక పేలవ క్రికెట్ ఆడుతుందని నేను భావించడం లేదు.’ అని సెహ్వాగ్ అన్నాడు.