ట్రెండింగ్లో నడుస్తున్న టిక్ టాక్ వంటి చైనా ఆధారిత యాప్లు వినియోగదారుల సమాచారాన్ని దొడ్డిదారిన అమ్మేసుకుంటున్నాయి.
మీరు బార్లో మందు కొడుతున్నారు.. ఎవరికీ తెలియదు అనుకుంటారు.. కానీ ఆ యాప్ చెప్పేస్తోంది మీరు ఎక్కడ ఉన్నారో.. మీరు షాపింగ్ మాల్లో గర్ల్ ఫ్రెండ్తో షికార్లు చేస్తున్నారు.. ఫోన్ లో అబద్ధం చెప్పేశారు.. ఆ యాప్ మాత్రం నిజం చెప్పేస్తోంది.. అదీ ఇదీ అని కాదండీ.. మీ మొబైల్ లో ఆ యాప్స్ ఉంటే చాలు.. మీ బండారం మొత్తం బట్టబయలు అవుతుంది. మరీ ఓవర్ గా చెప్పేస్తున్నారు అనుకోవద్దు.. ఇది పచ్చి నిజం. ఈ యాప్స్ ఏంటీ.. మీ డేటా వాళ్ల దగ్గరకు ఎలా వెళుతుంది.. మీ డేటాతో వారికి ఉపయోగం ఏంటీ అనేది రీడ్ ఇట్..
భారత మార్కెట్ను టార్గెట్ చేసుకుని వేల సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. అయితే సరైన వినియోగం ద్వారా వచ్చిన సంపద కాదు. అడ్డగోలుగా కస్టమర్ల కళ్లుగప్పి యూజర్ల సమాచారాన్ని దొంగిలించి అమ్మేసుకుంటున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో నడుస్తున్న టిక్ టాక్ కూడా ఇటువంటిదే. దీంతో పాటుగా మరిన్ని చైనా ఆధారిత యాప్లు వినియోగదారుల సమాచారాన్ని దొడ్డిదారిన అమ్మేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని పుణె ఆధారిత కన్సల్టింగ్ కంపెనీ అయిన ఆర్కా కన్సల్టింగ్ బయటపెట్టింది. వ్యక్తిగత సమాచారాలపై నిఘా పెట్టిన ఈ సంస్థ చైనా ఆధారిత యాప్ల మోసాన్ని వెలుగు చూసింది.
ఆ యాప్స్ డేటా ఎలా లీక్ అవుతుంది
మన ప్పైవసీని మనమే మార్కెట్లో పెట్టేస్తున్నాం. ఈ యాప్లు చేసే పనేంటంటే.. అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారం అడగడం. కెమెరా, మైక్రో ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వండి లేదా యాప్స్ పని చేయవు అని చెప్పడంతో మనం సమాచారాన్ని సులువుగా ఇచ్చేస్తాం. ఆ తర్వాత మనకు తెలియకుండానే వ్యక్తిగత సమాచారమంతా చాప కింద నీరులా చల్లగా జారిపోతుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే పర్మిషన్ అడుగుతూ ఉంటాయి. ఒక్కో దానికి యాక్సెప్ట్ కొట్టుకుంటూ పోతుంటే మన డేటాను తెలియకుండా మనమే పంపించేస్తున్నట్టన్నమాట. ఉదహరణకు చూస్తే జొమాటో, స్విగ్గీ యాప్లు ఫుడ్ డెలీవరీ చేయాలి కాబట్టి లొకేషన్ యాక్సెస్ అవసరం ఉంటుంది. కానీ, యూసీ బ్రౌజర్కు లొకేషన్ యాక్సెస్తో పనేం ఉంటుందన్నట్టు. అంతా చోరీ కోసమే.
ఏయే యాప్స్ అంటే:
యూత్ ఎక్కువగా టైమ్ పాస్ చేస్తూ.. ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుంటున్న హలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, విగో వీడియో, బ్యూటీ ప్లస్ క్లబ్ ఫ్యాక్టరీ ఎవరీథింగ్, న్యూస్ డాగ్, యూసీ న్యూస్, వీ మేట్ యాప్లు దొంగల జాబితాలో టాప్ స్థానానికి చేరాయి.
ఎవరికి అమ్మేస్తున్నారు..
ఈ యాప్లు అన్ని కలిసి తమ సమాచారాన్ని ఏడు ఏజెన్సీలకు అమ్మేస్తున్నాయట. దానిలో 69శాతం డేటా అమెరికాకు పంపిస్తుంటే టిక్ టాక్ అనే యాప్ మాత్రం చైనా టెలికామ్ ఏజెన్సీకి అప్పగిస్తుందట. క్యూక్యూ , యూసీ బ్రౌజర్లు మాత్రం అలీబాబాకు డేటాను సమర్పిస్తున్నాయి. వీటిలో దాదాపు సంస్థలన్నీ ప్రకటనల కోసం, సర్వేలు చేపట్టే సంస్థలేనట. వీలైనంత వరకూ వాడేసి మిగిలిన దాన్ని సింగపూర్ పంపేస్తారట. వారేమో థర్డ్ పార్టీ ఏజెంట్ల సాయంతో ఫోన్ నంబర్లను జాబితా రూపంలో అమ్మేస్తారట.
పరిష్కారం ఏంటీ
భారత దేశంలో సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ విషయాల్లో కఠిన నిబంధనలు లేకపోవడమే పెద్ద సమస్య. అమెరికాతో పాటు చైనా దేశాల్లో సెక్యూరిటీ అమలులో ఉంది. ఇక యూరప్ విషయానికి వస్తే ఇలా డేటా యాక్సెస్ చేయాలంటే లీగల్గా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, భారత్కు అటువంటి నియమాలు ఏమీ లేవు. 2017 డిసెంబరులోనే మినిస్టరీ ఆఫ్ డిఫెన్స్ 40వరకూ చైనా యాప్లను పర్సనల్ డేటా చోరీ చేస్తున్నాయని గుర్తించింది. అయినా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వాటి వినియోగం జరుగుతూనే ఉంది.
ఇప్పటివరకూ ఎంతమంది యూజ్ చేశారంటే:
భారత్లో ఈ యాప్స్ వినియోగదారులు అత్యధికంగా కనిపిస్తున్నారట. కేవలం యూసీ బ్రౌజర్ను 430మిలియన్ యూజర్లు వాడుతుండగా వారిలో భారత్ నుంచి మాత్రమే 130 మిలియన్ వినియోగదారులు దీనిని వాడుతున్నారట.