iPhone Order : ఆన్‌లైన్‌లో రూ. 1.5 లక్షల ఐఫోన్ ఆర్డర్ చేసి.. డెలివరీ ఏజెంట్‌ను చంపేసిన ఫ్లిప్‌కార్ట్ కస్టమర్..!

iPhone Order : ఖరీదైన ఐఫోన్ డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు ఏకంగా ఆ డెలివరీ ఏజెంట్‌ను చంపేందుకు సిద్ధపడ్డాడు. తన స్నేహితుడితో ఆ డెలివరీ ఏజెంట్‌ను గొంత కోసి దారుణంగా హత్యచేశాడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్. 

Flipkart customer orders Rs 1.5 lakh iPhone via cash on delivery

iPhone Order : ప్రతిఒక్కరిని ఆన్‌లైన్‌ సేల్ పండగ ఆఫర్లు ఊరిస్తున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారాల్లో అనేక స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను గుప్పిస్తున్నాయి. ఈ సేల్ సమయంలో ఒక ఫ్లిప్‌కార్ట్ యూజర్ ఆపిల్ ఐఫోన్ కోసం ఆర్డర్ పెట్టాడు.

అయితే, ఆన్‌లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఐఫోన్ డెలివరీ కాగానే డెలివరీ ఏజెంట్ ఆర్డర్ డబ్బులు చెల్లించాల్సిందిగా కోరాడు. దాంతో ఆ ఫ్లిప్‌కార్ట్ యూజర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఖరీదైన ఐఫోన్ డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు ఏకంగా ఆ డెలివరీ ఏజెంట్‌ను చంపేందుకు సిద్ధపడ్డాడు. తన స్నేహితుడితో ఆ డెలివరీ ఏజెంట్‌ను గొంత కోసి దారుణంగా హత్యచేశాడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్.

పక్కా పథకం ప్రకారమే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరా కాలనీలో జరిగింది. అనంతరం డెలివరీ ఏజెంట్‌ మృతదేహాన్ని నిందితులిద్దరూ గోనె సంచిలో వేసి కెనాల్‌లో పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. డెలివరీ ఏజెంట్ మృతదేహం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గజానన్‌గా గుర్తించిన నిందితుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్‌ను ఆర్డర్ చేసి, COD (క్యాష్ ఆన్ డెలివరీ) పేమెంట్ ఎంపికను ఎంచుకున్నాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ శశాంక్ సింగ్ పేర్కొన్నారు.

గొంతునులిమి దారుణ హత్య :
వివరాల్లోకి వెళితే.. యూపీలోని లక్నోలో గత నెల 23న ఈ ఘటన జరిగింది. నిషాత్‌గంజ్‌కు చెందిన భరత్ సాహు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా భరత్ ఐఫోన్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను గజానన్ అనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ ఆర్డర్ చేశాడు. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు.

ఆ ఐఫోన్ డెలివరీ చేసేందుకు భరత్ దగ్గరికి వెళ్లాడు. ఆ ఐఫోన్ డెలివరీ చేయగానే డబ్బులు చెల్లించామని గజానన్‌ను అతడు అడిగాడు. దాంతో సాహును మరో వ్యక్తితో కలిసి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అతడి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇందిరా కెనాల్‌లో పారేశారు. మృతదేహాన్ని గుర్తించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం రంగంలోకి దిగింది.

సాహు కుటుంబం ఫిర్యాదుతో వెలుగులోకి :
సాహు రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో సెప్టెంబర్ 25న చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. “నా సోదరుడు ఒక ప్రొడక్టు డెలివరీ చేయడానికి వెళ్ళాడు.

అతను డెలివరీ చేసిన ప్రొడక్టు ధరను డిమాండ్ చేసినప్పుడు కస్టమర్ నా సోదరుడిని చంపాడు. నా సోదరుడికి న్యాయం చేయాలి. అతనికి వివాహం జరిగింది” అని వాపోయాడు. సాహు కాల్ వివరాలను స్కాన్ చేసి.. అతని లొకేషన్‌ను కనుగొనే ప్రయత్నంలో, పోలీసులు గజానన్ నంబర్‌ను కనుగొని అతని స్నేహితుడు ఆకాష్‌ను విచారించారు. విచారణలో ఆకాష్ నేరం అంగీకరించాడని డీసీపీ వెల్లడించారు.

హత్యా ఘటనపై ఫ్లిప్‌కార్ట్ ప్రకటన :
దీనిపై ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. “మా డెలివరీ ఏజెంట్‌తో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన పట్ల చింతిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటాం. డెలివరీ ఏజెంట్ కుటుంబానికి సాధ్యమైన సహాయాన్ని అందిస్తాం. పోలీసుల విచారణలో కూడా మావంతుగా సహకరిస్తాం” అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Read Also : OnePlus 12 Price Drop : విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. రూ. 9వేల వరకు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?