5G Technology Covid-19 : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్కు 5Gతో సంబంధమే లేదు.. పుకార్లకు కేంద్రం చెక్!
భారతదేశంలో విజృంభిస్తోన్న కరోనావైరస్ సెకండ్ వేవ్ కు 5జీ టెస్టింగ్ టెక్నాలజీనే కారణమంటూ సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదలకు 5జీతో సంబంధం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.
- Sreehari A
- Published On : May 11, 2021 / 12:27 PM IST
No Link Between 5g Technology And Surge In Covid Cases
No link between 5G technology Covid cases in India : భారతదేశంలో విజృంభిస్తోన్న కరోనావైరస్ సెకండ్ వేవ్ కు 5జీ టెస్టింగ్ టెక్నాలజీనే కారణమంటూ సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదలకు 5జీతో సంబంధం ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ తప్పుడు సమాచారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. అసలు 5జీ టెక్నాలజీకి, కరోనావైరస్ వ్యాప్తికి మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్రం కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం. నిరాధారమైన సమాచారాన్ని చూసి ప్రజలెవరూ నమ్మొద్దనని టెలికాం విభాగం(డాట్) స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 5జీ నెట్వర్క్ టెస్టింగ్ చేయడం వల్లే కరోనా వ్యాపిస్తోందన్న వదంతులను డాట్ చెక్ పెట్టేసింది.. అసలు ఎలాంటి టెస్టింగ్ జరగడం లేదు. 5జీ సాంకేతికతకు, కరోనాకు సంబంధమే లేదని డాట్ స్పష్టంచేసింది. మొబైల్ టవర్ల నుంచి నాన్-అయానైజింగ్ రేడియో తరంగాలు చాలా తక్కువ శక్తితో వెలువడతాయని పేర్కొంది.
ఆ రేడియో తరంగాలతో ఎలాంటి కణాలపై లేదా మానవులపై ఏ విధమైన ప్రభావాన్నీ చూపలేవని డాట్ పేర్కొంది. నాన్-అయానైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్పై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిషన్(ICNIRP), WHO సిఫారసు చేసిన పరిమితుల కంటే 10 రెట్ల భద్రతా నిబంధనల్లో ఉన్నామని డాట్ తెలిపింది. పలు దేశాల్లో 5జీ సేవలను ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారం చూపి భయభ్రాంతులకు గురికావొద్దని సూచించింది.
