భారత్ లో పాక్ విలీనం తథ్యం – మోహన్ భగవత్
- madhu
- Published On : February 26, 2021 / 03:28 PM IST
RSS
Akhand Bharat : భారత్లో పాకిస్తాన్ విలీనం తథ్యమని అది హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. భగవంతుడు భారతదేశాన్ని ఒక్కటిగానే సృష్టించాడని.. అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందని, దీన్నెవరూ విభజించలేరని లార్డ్ వేవెల్ నాటి బ్రిటిష్ పార్లమెంట్లో ఎలుగెత్తాడని తెలిపారు. కానీ కాలక్రమంలో ఊహాతీతమైనదే జరిగిందని… దేశ విభజనకు ఆరు నెలల ముందు కూడా ఏ ఒక్కరూ దీనిని ఊహించలేదన్నారు. పాకిస్తాన్ ఏర్పాటుపై జనం అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూని అడిగితే.. దేశ విభజనా? అది మూర్ఖులు కనే కల అని బదులిచ్చారని తెలిపారు. అసాధ్యం అనుకున్నది ఏ రకంగా సాధ్యమైందో.. ప్రస్తుతానికి కూడా అసాధ్యం అనిపిస్తోన్న అఖండ భారత్ సుసాధ్యం కావొచ్చన్నారు.
ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజమని, అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశమని అన్నారు మోహన్ భగవత్. హైదరాబాద్ హైటెక్స్లో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన విశ్వభారతం గ్రంథ ఆవిష్కరణ సభలో మోహన్ భగవత్ మాట్లాడారు. ధర్మానికి కేంద్ర బిందువైన భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడినా నేటివరకు అశాంతి, అలజడితోనే ఉన్నాయని మోహన్ భగవత్ చెప్పారు. దేశం నుంచి విడిపోయిన భూభాగాలు భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లారు మోహన్ భగవత్. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సేంద్రీయ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారాయన
