Godavari Pushkaralu-2027
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు -2027 నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్కరాల (Godavari Pushkaralu) తేదీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పుష్కరాల తేదీలను తిరుమల జ్యోతిష్య సిధ్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తూ.. అందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు మొత్తం 12రోజులు జరగనున్నాయి. జూన్ 26వ తేదీన పుష్కరాలు ప్రారంభం అవుతాయి. జులై 7వ తేదీన పుష్కరాలు ముగుస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్ఆఫిషియో సెక్రటరీ డా. ఎం. హరి జవహర్లాల్ ఉత్తర్వులు జారీచేశారు.
గోదావరి పుష్కరాలకు సంబంధించిన తేదీలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో.. తూర్పుగోదావరి జిల్లా సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం కానుంది.