Bandi Sanjay Kumar : దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతోంది- బండి సంజయ్
ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి. పేదలు, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదు.
- Naveen
- Published On : April 30, 2024 / 03:01 PM IST
Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar : దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందన్నారు. వేములవాడలో బండి సంజయ్ మాట్లాడారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించారని, ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. అందుకే 6 గ్యారెంటీలపై అడిగితే మాట్లాడలేనని సీఎం రేవంత్ అంటున్నారని బండి సంజయ్ అన్నారు.
”కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. రైతులు, నిరుద్యోగులు సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించని నేత వినోద్ కుమార్. నాపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పొన్నం ప్రభాకర్ నా గురించి అవాకులు పేలుతుండటం సిగ్గుచేటు. పొన్నం వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు. సమాజంలో అనేక బాధలు ఎదుర్కొంటున్నది మాదిగలే. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు బలిదానమయ్యారు.
మాదిగ సమాజంపై అవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి. పేదలు, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదు. ఈ నెల 8న వేములవాడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. వేములవాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి” అని పిలుపునిచ్చారు బండి సంజయ్.
Also Read : నా ఫేక్ వీడియో వెనుక ఆయన హస్తం ఉంది: అమిత్ షా
