Bandi Sanjay Comments : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తెలంగాణలో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీని విమర్శిస్తున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు.
Read Also : Vijay Sai Reddy : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
గెలిపిస్తే.. అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా :
బుధవారం (మార్చి 6) మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ఎందుకు విస్మరించారో చెప్పాలని సూటిగా బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అభ్యర్థి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపిస్తే.. రాష్ట్రానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని బండి సంజయ్ చెప్పారు.
ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు ఊరుకోం :
రాముడంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయమన్నారు. ఉద్యోగాల కోసం కొట్లాడింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే తనపై 100 కేసులు ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలన కొనసాగించిందని మండిపడ్డారు. పేదల బతుకులు మారాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని హితవు పలికారు.
అయినా, రేవంత్ ప్రధాని మోదీని కలవడంలో తప్పేముందన్నారు. అందరం కలిసి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తాను అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు ఊరుకోనేది లేదన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న బండి సంజయ్.. బీజేపీకి ఓటు వేసి తనను గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.
Read Also : TDP Janasena BJP Alliance Issue : పొత్తు పొడిచేనా? టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై తెలకపల్లి రవి విశ్లేషణ