Asaduddin Owaisi: ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది.. మునుగోడు కోసం రాష్ట్రాన్ని తగలబెడతారా?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
- Harishth Thanniru
- Published On : August 23, 2022 / 03:14 PM IST
asaduddin owaisi salms nitish kumar
Asaduddin Owaisi: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మజ్లీస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన విషయం విధితమే. ఈ విషయంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన ఉద్దేశపూర్వక వ్యాఖ్యల్లో ఇదో భాగమని అసదుద్దీన్ మండిపడ్డారు.
BJP MLA Raja singh Arrested : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
బీజేపీ ముస్లింలను, మహమ్మద్ ప్రవక్తను ద్వేషిస్తుందని, ఇది బీజేపీ యొక్క అధికారిక విధానంగా కనిపిస్తోందని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, వాయిస్ రికార్డింగ్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపాలని, విచారణ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు హైదరాబాద్ లో శాంతిని చూడలేక పోతున్నారని, బీజేపీ దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటోందా అంటూ ప్రశ్నించారు. ముస్లింలను మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడం బీజేపీ అధికారిక విధానమని, నుపుర్ శర్మ జైలులో ఉన్నారా? ఇప్పుడు కూడా మీరు ఆమెకు పోలీసు రక్షణ కల్పించారంటూ మండిపడ్డారు.
KTR Comments On Amit Shah : అమిత్ షా అబద్ధాలకు బాద్ షా : మంత్రి కేటీఆర్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రకటనను ప్రధాని అంగీకరిస్తారా అని అసదుద్దీన్ఓ వైసీ ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారని, లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం అంటూ ఓవైసీ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా అంటూ ప్రశ్నించారు.
