CM KCR : కేసీఆర్పై కమల వ్యూహం,గజ్వేల్లో ఈటల,కామారెడ్డిలో విజయశాంతి.. గులాబీ బాస్పై పోటీకి సై అంటున్న నేతలు
గులాబీ బాస్ కేసీఆర్ పై పోటీకి సై అంటున్నారు కమలం నేతలు. కేసీఆర్ రెండు చోట్ల పోటీకి దిగితే ఆరెండు చోట్ల బీజేపీ నేతలు పోటీకి సై అంటున్నారు. ఈటల రాజేందర్, విజయశాంతిలు కేసీఆర్ పై పోటీకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది.
- nagamani
- Published On : August 24, 2023 / 04:19 PM IST
KCR vs Etala And Vijayashanti
KCR vs Etala And Vijayashanti : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైపోయింది.ఇప్పటికే గులాబీ బాస్ కొన్ని స్థానాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. గత ఎన్నికల్లో కంటే భిన్నంగా సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో రెండు స్థానాల్లో పోటీకి దిగిన కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
దీంట్లో భాగంగానే బీజేపీ గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీకి ఈటల రాజేందర్(etala rajender), అలాగే కామారెడ్డిలో రావులమ్మగా పేరున్న విజయశాంతి(Vijayashanti)ని బరిలోకి దింపాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలా కేసీఆర్ పై కమల దళం వ్యూహం రచిస్తోంది. ఈటల సిట్టింగ్ స్థానం హుజూరా బాద్. అదే స్థానం నుంచే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీ తరపున అదే స్థానంలో పోటీ చేసి ఈటల గెలుపొందారు. కేసీఆర్ పై బీజేపీ కీలక నేతల పోటీతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ముందస్తు ప్లాన్లతో కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంలో ఏమాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా కేసీఆర్ ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ ప్లాన్ ను బీజేపీ ముందే ఊహించినట్లుగా ఉంది అందుకే కేసీఆర్ పై ఈటల, విజయశాంతిలను పోటీకి దింపే యోచనలో ఉంది. రఘునందనరావు లాంటి బీజేపీ నేతలు కేసీఆర్కు ధైర్యం ఉంటే గజ్వేల్ లో మళ్లీ పోటీ చేయాలని సవాలు విసిరారు. మరి ఈ సవాలును కేసీఆర్ ఛాలెంజ్ గా తీసుకుని గజ్వేల్ బరిలో దిగుతున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే ఆసక్తి నెలకొంది. ఇలా కారణం ఏదైనా కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం అనేది మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
