లోక్సభ ఎన్నికల్లో పోటీచేయబోయే తమ పార్టీ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తొలి దశ జాబితాలో నలుగురి పేర్లను ఆయన ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేస్తారని తెలిపారు.
గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి, సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక చేసి పై నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ కూడా ఇప్పటికే ప్రకటించింది. అలాగే, అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
కాగా, 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో తొమ్మిది లోకసభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ముగ్గురు ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతు కవిత పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. వారిలో తొలి లిస్టులోనే నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత పేర్లను బీఆర్ఎస్ ప్రకటించడం గమనార్హం.
మహబూబాబాద్ పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. దశాబ్దకాలంగా అక్కడ కారు జోరుకు బ్రేకుల్లేకుండాయ్ పోయాయ్. మాలోతు కవిత ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014లో గెలిచిన సీతారాం నాయక్ను కాదని, 2019లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు.
Also Read: గొర్రెల పంపిణీ కేసులో మరో కుంభకోణం.. బాగోతాలు బట్టబయలు