సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు నా మీద కేసు పెట్టారు: హరీశ్ రావు

"మీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం" అని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. “అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు” అని అన్నారు.

“నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు” అని అన్నారు.

“సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు.

నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను” అని హరీశ్ రావు అన్నారు.

Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు