కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కావ్య

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం

BRS MLA Kadiyam Srihari

Kadiyam Srihari Join in Congress Party : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్యతో కలిసి ఆదివారం ఉదయం సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కావ్య పేరును ప్రకటించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి, కావ్యలు శనివారమే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే, శ్రీహరి తన నియోజకవర్గంలో ఆయన వర్గీయులతో సమావేశం అయ్యారు. సమావేశం ఆలస్యం కావటంతో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిన సమయానికి చేరుకోలేక పోయారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి సచివాలయంలో పలు సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో శనివారం కడియం శ్రీహరి, ఆమె కుతురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆదివారం ఉదయమే రేవంత్ నివాసానికి చేరుకున్న కడియం శ్రీహరి, కావ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

Also Read : వలసలను నిలువరించలేకపోతున్న గులాబీబాస్.. ఏం జరుగుతోందో తెలుసా?

గత కొద్దిరోజులుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం సీటును బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు కేటాయించింది. దీంతో కడియం పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడింది. కానీ, ఊహించని రీతిలో కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈమేరకు బీఆర్ఎస్ అధిష్టానంకు కావ్య లేఖ రాశారు. అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Also Read : అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు ఇలా ఉంటాయని తెలుసా? ప్రతిదానికి ఓ రేటు..

కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో కావ్య అభ్యర్ధిత్వాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు దఫాలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పటికీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానంకు పలువురు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత ఆయనకు వరంగల్ ఎంపీ సీటును కేటాయిస్తారని భావించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరి పార్టీలోకి వస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కడియం కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు