BRS Sweda Patram : బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల.. పదేళ్ల పాలనపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ ‘స్వేదపత్రం’ పేరుతో ఆదివారం తెలంగాణ భవనంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు.
- Harishth Thanniru
- Published On : December 24, 2023 / 11:48 AM IST
BRS Sweda Patram
BRS MLA KTR : బీఆర్ఎస్ పార్టీ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని ‘స్వేదపత్రం’ పేరుతో ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్వేదపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వరకు మా ప్రయాణం సాగిందని, దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. గత పాలకులు ఉద్దేశ పూర్వకంగా జీవన విధ్వంసం చేశారని, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అన్నట్లుగా బతుకులు ఉండేవని కేటీఆర్ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణను అన్నివిధాల అభివృద్ధి బాటలో నడిపించామని కేటీఆర్ చెప్పారు. మా పాలనపై కాంగ్రెస్ బురదచల్లే ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన అవసరం మాపై ఉందని అన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేలా కొంత ప్రయత్నం చేసిందని కేటీఆర్ అన్నారు. సభలో మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరకు వాయిదా వేసుకొని వెళ్లిపోయారు. ఉన్నకొద్ది సమయంలో కాంగ్రెస్ ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టాం. బాధ్యతగల పార్టీగా పూర్తిస్థాయి సమాచారంతో స్వేదపత్రం విడుదల చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొందని, ఎన్నో పోరాటాల తరువాత తెలంగాణ సాకారమైందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు తమవల్లనే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Robin Sharma: ఇప్పటికే టీడీపీ తరఫున రాబిన్ శర్మ.. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. ఏం చేస్తున్నారో తెలుసా?
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. తెలంగాణ ప్రయోగం విఫలం అవుతుందని కొందరు అన్నారు. తొలినాళ్లలోనే కొందరు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు.. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేశారని కేటీఆర్ అన్నారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అంకెల గారడీ, అభాండాల చిట్టా అని కేటీఆర్ విమర్శించారు. రూ. 3.17 లక్షల కోట్ల అప్పును రూ. 6.70 లక్షల కోట్ల అప్పులుగా చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు, ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని కేటీఆఆర్ అన్నారు.
