Karimnagar Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తరహాలో మరో అద్భుతం, కరీంనగర్లో త్వరలో అందుబాటులోకి..
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో కరీంనగర్ లో కూడా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అత్యాధునిక హంగులతో విదేశీ టెక్నాలజీతో చేపట్టిన దీని నిర్మాణం పూర్తవడంతో అధికారులు.. సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
- Naveen
- Published On : June 29, 2021 / 01:47 PM IST
Karimnagar Cable Bridge
Karimnagar Cable Bridge : హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో కరీంనగర్ లో కూడా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అత్యాధునిక హంగులతో విదేశీ టెక్నాలజీతో చేపట్టిన దీని నిర్మాణం పూర్తవడంతో అధికారులు.. సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కో టిప్పర్ లో 30 టన్నుల ఇసుకతో మొత్తం 28 టిప్పర్లతో లోడ్ టెస్టు జరుపుతున్నారు. 500 మీటర్ల పొడవైన బ్రిడ్జిపై ఫోర్ లేన్ రోడ్డు పూర్తైంది. మానేరు తీరంలో రూ.180కోట్లతో ఈ తీగల వంతెన నిర్మించారు. ఇటలీ నుంచి తెప్పించిన కేబుల్స్ తో ఈ వంతెన నిర్మించారు. త్వరలోనే ఈ వంతెను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 2017లో డిసెంబర్ లో శంకుస్థాపన జరిగింది. 2018 ఫ్రిబవరిలో పనులు ప్రారంభం అయ్యాయి. 500 మీటర్ల పొడవైన తీగల వంతెనకు 2 పైలాన్లు నిర్మించి 26 కేబుల్స్ ని అమర్చారు. 2 పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు. పైలాన్ నుంచి ఇంటర్ మీడియన్ కి 110 మీటర్ల దూరం ఉంటుంది. 7 మీటర్ల వెడల్పున రెండు దారులు, రెండున్నర మీటర్ల వెడల్పున రోడ్లకు ఇరువైపుల ఫుట్ పాత్ లు నిర్మించారు. ఈ వంతనె పై ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.40కోట్లు కేటాయించింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కరీంనగర్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా పర్యాటకంగా కూడా నగరం అభివృద్ధి చెందుతుంది.
