Chigurupati Jairam case:
Chigurupati Jairam case: పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దోషి రాకేశ్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో రాకేశ్ రెడ్డిని ఇటీవలే నాంపల్లి కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మరో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిలో ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు.
చిగురుపాటి జయరాం హత్య 2019 జనవరి 31న జరిగింది. అప్పట్లో ఈ హత్యపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు 320 పేజీల చార్జిషీట్ న్యాయస్థానంలో దాఖలు చేశారు. న్యాయస్థానానికి 48 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిగింది. చిగురుపాటి జయరాం మేన కోడలు శిఖా చౌదరి ద్వారా 2017లో ఆయనకు రాకేశ్ రెడ్డి పరిచయం అయ్యాడు.
రాకేశ్ రెడ్డి నుంచి జయరాం అతని వద్ద నుంచి రూ.4 కోట్ల అప్పు తీసుకోవడంతో గొడవలు మొదలయ్యాయి. రూ.4 కోట్ల మరో రూ.2 కోట్ల వడ్డీతో కలిపి మొత్తం రూ.6 కోట్లు చెల్లించాలని రాకేశ్ రెడ్డి వాదించాడు. అనంతరం జయరాం అమెరికా వెళ్లారు. ఆ తర్వాత జయరాంకు హనీ ట్రాప్ వేయించిన రాకేశ్ రెడ్డి ఓ ప్రాంతానికి ఆయనను రప్పించారు.
హైదరాబాద్, జూబ్లీ హిల్స్లోని తనకు చెందిన ఓ ఇంట్లో ఆయనను బంధించి చిత్రహింసలు పెట్టి చంపారు. అనంతరం జయరాం మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి, కారును పలు ప్రాంతాల్లో తిప్పాడు. నందిగామ సమీపంలో రోడ్డు పక్కన ఆ కారును వదిలేశాడు.హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. అయితే, పోలీసుల విచారణలో దొరికిపోయాడు.