Telangana All Party Meeting : కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం 2021, జూన్ 27వ తేదీ ఆదివారం ప్రగతి భవన్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

All Party Meeting

Telangana All Party Meeting : సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించడానికి రంగం సిద్ధమౌతోంది. రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం 2021, జూన్ 27వ తేదీ ఆదివారం ప్రగతి భవన్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. వారితో పాటు ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ శాసనసభా పక్షనేతలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్‌ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభధ్రంకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి కోరారు.

దళితుల సమస్యల పట్ల అవగాహన కలిగి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్‌ దళిత నాయకులను ఆహ్వానించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే..ఆరేళ్ల తర్వాత అఖిలపక్ష భేటీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి భేటీ నిర్వహిచండం రెండోసారి అని చెప్పవచ్చు. 2014, డిసెంబర్ 16వ తేదీన భేటీ జరిగింది. మెట్రో రైల్ ప్రాజెక్టు అలైన్ మెంట్ మార్పు అంశంపై ఈ భేటీ జరిగింది. రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష భేటీని కేసీఆర్‌ నిర్వహించారు.