CM KCR : మోదీకి లేఖ రాయనున్న సీఎం కేసీఆర్…ఎరువుల ధరలు పెంచడంపై మండిపాటు
కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
- madhu
- Published On : January 12, 2022 / 01:11 PM IST
Cm Kcr
CM KCR Letter : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాయనున్నారు. ఎరువుల ధర పెంపును ఆయన లేఖలో ప్రస్తావించనున్నారు. ఎరువుల ధరలను ఇటీవలే కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. ఈ పెంపును సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర వైఖరిపై ఆయన మండిపడుతున్నారు. ఈ క్రమంలో..ఆయన పీఎం మోదీకి లేఖ రాయాలని నిశ్చయించుకున్నారు. రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రం గొప్పలు చెప్పి…ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డి విరిచిందని విమర్శించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిర్ధారణ అయ్యిందన్నారు.
Read More : KCR Tejaswi Yadav: జాతీయ రాజకీయాలపై కేసీఆర్, తేజస్వి చర్చ
రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం యొక్క నడ్డి విరిచిందని మండిపడ్డారు. దేశ రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్న ఆయన…కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం… ఎన్ఆర్జీ (NRG)ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయకుండా నాన్చుతూ.. విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం…వెనక కుట్ర దాగి ఉందన్నారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Read More : AAP in Punjab: పంజాబ్ ఎన్నికల కోసం పది పాయింట్లతో ఆప్ రెడీ
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకొలేని పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకుని..బీజేపీ ప్రభుత్వంపై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలన్నారు సీఎం కేసీఆర్.
