Telangana Elections 2023: సింహగర్జన సభలో బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తాం: కేసీఆర్
ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ అని, తమకు మాత్రం ఒక టాస్క్ అని కేసీఆర్ అన్నారు.
- T Venkateshwarlu
- Published On : August 21, 2023 / 04:57 PM IST
CM KCR
Telangana Elections 2023 – BRS: తెలంగాణ(Telangana)లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్పష్టతనిచ్చారు. ఇవాళ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆయన విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను అక్టోబరు 16న వరంగల్లో నిర్వహించే సింహగర్జన బహిరంగ సభలో ప్రకటిస్తామని అన్నారు. ఇందులో ఎన్నో సంక్షేమ పథకాలను పొందుపర్చుతున్నట్లు వివరించారు. అదే రోజు అక్కడ భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ అజెండా ప్రగతి అని స్పష్టం చేశారు.
కాగా, ఆ రోజున దాదాపు 10 లక్షల మందితో ఈ బహిరంగ సభను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వరంగల్ బీఆర్ఎస్ నేతలకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. అంతమందిని సమీకరించడానికి, సభకు ఏర్పాట్లపై ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు.
కేసీఆర్ ఎన్నికల కోసం ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు సమాచారం. వచ్చేది కూడా తమ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 95-105 స్థానాల మధ్య బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ అని, తమకు మాత్రం ఒక టాస్క్ అని అన్నారు.
