CM Revanth Reddy
గత బీఆర్ఎస్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని, తాము మాత్రం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి ఇవాళ నియామక పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం.. ఉద్యోగాలు ఇవ్వడాన్ని బాధ్యతగా భావించలేదని అన్నారు. ఉద్యోగాల కోసం నిరీక్షించి, నిరీక్షించి గత ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. బీఆర్ఎస్ వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పానని గుర్తుచేశారు. తన మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ను గెలిపించారని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90 రోజుల్లోనే తాము ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు.
దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతి కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 1,635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని ఇది భావోద్వేగమని, ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని, విద్యార్థి, నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారని అన్నారు. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని తెలిపారు.
ఢిల్లీకి సీఎం రేవంత్, క్యాబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ఛాన్స్ ఎవరికో..?