కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్.. ఏం చెప్పారంటే?
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- June 3, 2024 / 04:21 PM IST
CM Revanth Reddy meeting with congress MP candidates over votes counting
CM Revanth Reddy on Counting: లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలపై అమితాసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఈ రెండు పార్టీలు అటు ఇటుగా సమాన స్థాయిలో సీట్లు గెలిచే అవకాశముందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, 17 మంది ఎంపీ అభ్యర్థులు సమావేశంలో పాల్గొన్నారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు.
ఎంపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..
కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి.
పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలి.
సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోండి.
Also Read: మాట నిలబెట్టుకున్న కేసీఆర్.. కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తెకు ఆర్థికసాయం
ప్రతీ రౌండ్ లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ప్రతీ ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలి.
ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి.
ప్రతీ అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలి.
