Telangana Formation Day: ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పరేడ్ మైదానంలోని వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Formation Day Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
- Harish Thanniru
- Updated on- June 2, 2026 / 11:57 AM IST
CM Revanth Reddy at Telangana State Formation Day Celebrations
Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Also Read – Divvala Madhuri : తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి.. పోటీ చేస్తాను అంటూ..
పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రహితం కోసం పనిచేస్తున్నామని, మాది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 30నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని, తెలంగాణ విజన్ -2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నామని, రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల సేవకులుగా పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ప్రజల ఆశయాల సాధనలో ముందడుగు వేశామని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రూ.2లక్షల వరకు పంట రుణమాఫీ అమలుతోపాటు.. రూ.20,616 కోట్లతో 25లక్షల మంది రైతులకు రుణ విముక్తి ఇలా వ్యవసాయానికి రెండున్నరేళ్లలో రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.27,529 కోట్లు జమ చేయడం జరిగిందని, ఈ ఏడాది ఇప్పటికే రూ.5,700 కోట్ల రైతుభరోసా నిధుల విడుదల చేయడం జరిగిందని, ధాన్యం కొనుగోళ్లకు రెండున్నరేళ్లలో రూ.82,840 కోట్లు వ్యయం అయిందని, యాసంగిలో 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిపి రైతుల ఖాతాల్లో రూ.11,903 కోట్లు జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ ధాన్యం సేకరణలో తెలంగాణ వాటా 60శాతంగా ఉందని అన్నారు. మొక్కజొన్న, జొన్న సాగులో తెలంగాణ రైతులు కొత్త రికార్డు నెలకొల్పారని అన్నారు. ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోస్తామన్న సీఎం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, మహిళా సంఘాలకు రూ.60 వేలకోట్ల సున్నా వడ్డీ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో మహిళలకు రూ.10 వేలకోట్లను ఆదా చేశామన్నారు. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, 53.09 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రెండున్నరేళ్లలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని అన్నారు. త్వరలో ఇంజనీరింగ్, అటవీ, విద్యాశాఖ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు.
విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగావకాశాలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. మొదటి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశామని, 13 నెలల్లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ చేశామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ యోధుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ వేశామని తెలిపిన సీఎం.. దేశంలోనే తొలిసారి సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే చేపట్టామని, ఎస్సీ ఉపవర్గీకరణ అమలు ప్రారంభం, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు.
ఉద్యోగులకోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు, నగదు రహిత వైద్య సేవలతో EHS అమలు, ఆరోగ్య మౌలిక వసతులకు రూ.11 వేలకోట్ల వ్యయం, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం EAGLE ప్రత్యేక బృందం, గద్దర్ పేరుతో రాష్ట్ర సినిమా అవార్డుల పునఃప్రారంభం, గోదావరి పుష్కరాలకోసం రూ.1000 కోట్ల నిధుల కేటాయింపుతోపాటు హజ్ యాత్రికులపై అదనపు ఆర్థిక భారం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
