Police Commemoration Day: పోలీసు సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- Harishth Thanniru
- Published On : October 21, 2024 / 11:23 AM IST
CM Revanth Reddy
CM Revanth Reddy: శాంతి భద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. పోలీసు సిబ్బంది పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉంది. పోలీసులు, వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలి. ఎవరి ముందో చేయిచాచే పరిస్థితి తెచ్చుకోవద్దని, విమర్శలకు అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నానని అన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: KTR: రైతుబంధు కావాలా..? ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అమరులైన కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా.. ఎస్ఐ, సీఐ కుటుంబాలకు రూ. 1.25 కోట్లు, డీఎస్పీ, ఎస్పీ కుటుంబాలకు రూ. 1.50 కోట్లు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ. 2 కోట్ల పరిహారం ఇస్తామని అన్నారు. అదేవిధంగా శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోంది. అయితే, డ్రగ్స్ నివారణపై ఫోకస్ పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏఐ పరిజ్ఞానంతో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: రసవత్తరంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. కేసీఆర్ నిర్ణయంతో బరిలోకి ఎంఆర్ఎస్..!
