CM Revanth Reddy : హైటెన్షన్ వైరు లాంటోడిని, టచ్ చేసి చూడు మాడిపోతావ్- కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్

ఎస్సీల వర్గీకరణ కావాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

Cm Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా చెలరేగిపోయారు. తీవ్ర వ్యాఖ్యలతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తనను తాను హైటెన్షన్ వైరుతో పోల్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. టచ్ చేసి చూడు కాకిలా మాడిపోతావ్ అంటూ కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కారు వర్క్ షాప్ నుంచి ఇంటికి రాదని, తూకానికి అమ్మాల్సిందే అంటూ బీఆర్ఎస్ ను ఉద్దేశించి చెలరేగిపోయారు సీఎం రేవంత్.

మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ దగ్గరే సరిగా ఉండటం లేదు.. పక్క పార్టీ నుంచి 20మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తారని చెబుతారా? అంటూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు సీఎం రేవంత్.

అటు బీజేపీ నేత డీకే అరుణపైనా రేవంత్ మండిపడ్డారు. పాలమూరుకు డీకే అరుణ చేసిందేమీ లేదన్నారు. ఎస్సీల వర్గీకరణ కావాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.

”ఆనాడు పాలమూరు ఊరు లేకపోయినా, పార్లమెంట్ లో నోరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ను గెలిపించి పంపిస్తే ఇచ్చింది ఏమిటీ.. తెచ్చింది ఏమిటీ..? కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీలు కూడా కేసీఆర్ భర్తీ చేయలేదు. జూరాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి గురించి ఎప్పుడైనా పార్లమెంటు మాట్లాడారా..? మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలి? శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేస్తే ఏం ఉపయోగం..?

కేటీఆర్.. మీ కారు కరాబ్ కాలేదు.. ఇంజన్ అనుం చెడ్డది.. తూకానికి అమ్ముడే.. కారును బండకేసి కొట్టారు.. వంద మీటర్ల లోతులో బొందపెట్టారు. ఇంకా కేసీఆర్ పొంకనాలు కొడుతున్నాడు.. పిట్టల దొర 20 మంది ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద ..తోడేళ్లలా కొట్టుకుపోతామని అనుకుంటున్నావా..? చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు.. నీ దగ్గర ఎవరు ఉంటరో చూడు. కాపలా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి.. ప్రయత్నం చేసి చూడు.. మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి  ఉన్నాడు ఇక్కడ.. వచ్చి ముట్టుకో.. కాకిలా మాడిపోతావ్. ఈ సాయంత్రానికి నీ దగ్గర ఎంత మంది ఉంటారో లెక్క పెట్టుకో.

100 రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచాం. 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం. ఆడబిడ్డలను ఆదుకుంటాం. ఇందిరమ్మ రాజ్యంలో మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చాం. ఉమ్మడి జిల్లాలో అనేక విద్యాసంస్థలను తీసుకువచ్చాం.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 30వేల కోట్లు కేంద్రం నుంచి రాబట్టడానికి ఒత్తిడి తీసుకువచ్చాం. పాలమూరులో కాంగ్రెస్ ను ఓదించాలని గద్వాల నుంచి దొరసాని బయలుదేరింది. మీ గద్వాల గడీల ముందు బానిసలుగా బతకదల్చుకోలేదు. మీ జాతకం, రంగు, నీతి, జాతి మాకు తెలుసు. మిమ్మల్ని పండబెట్టి తొక్కి మా అభ్యర్థిని కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంటుకు పంపిస్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ను చేశాం. జిల్లా నాయకులకు గుర్తింపునిచ్చాం. ఆగస్టు 15 లోగా ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. పార్లమెంటులో కొట్లాడి వర్గీకరణ సాధించే బాధ్యత మాది. 30 ఏళ్ల వర్గీకరణ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించే బాధ్యత మాది.

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, సమస్యలు పరిష్కారం కావాలన్నా ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. ఇక్కడే పుట్టినా, పెరిగినా, పోయినా ఇక్కడి మట్టిలో కలిసిపోతా. నల్లమల బిడ్డగా పాలమూరుపైన నాకు ఉన్న దుఖం ఎవరికైనా ఉంటుందా? నేను పాలమూరు బిడ్డను.. అభివృద్ధి చేసే బాధ్యత నాది. పార్లమెంటులో మన బిడ్డ ఉండాలి.. ఆలోచించండి. నాలుగున్నరేళ్లు ఇంకా అధికారంలో ఉంటాం. పదేళ్లు అధికారంలో ఉన్నా మోడీ దగ్గరకు వెళ్లి బీజేపీ నేతలు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదు. డీకే అరుణ గెలిచినా జిల్లాకు ఏమీ ఉపయోగం ఉండదు.

పదేళ్లు ఏమీ చేయని బీజేపీ, బీఆర్ఎస్ లకు ఎందుకు ఓటేయాలి? అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాకముందే అన్నీ చేయాలంటున్నారు. డిసెంబర్ లో కేడీని బొందపెట్టినం.. మోడీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ దొంగదెబ్బ తీయడం కోసం వెనకాల ఒకటయ్యారు. మహబూబ్ నగర్ లో ఎలాగైనా గెలుస్తాం. అయినా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.. గల్లీ నుంచి కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా ఈ గడ్డ మనది..

మీ బిడ్డకు దేశం నలుమూల నుంచి పిలుపు వస్తుంది. దేశంలో మన గడ్డ గౌరవాన్ని పెంచుతా. మహబూబ్ నగర్ లో లక్ష మెజారిటీకి ఒక్క ఓటు కూడా తగ్గొద్దు. నాగర్ కర్నూల్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి లక్ష మెజారిటీ రావాలి. రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Also Read : ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

 

 

ట్రెండింగ్ వార్తలు