కరోనా బారిన పడిన ఓ ఎస్ఐకి ప్లాస్మా దానం చేసి కానిస్టేబుల్ ఔదార్యం చాటుకున్నారు.
కరోనా వైరస్ సోకిన బాచుపల్లి ఎస్ఐ మహ్మద్ యూసుఫ్ కు చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ ఆర్.సాయికుమార్ ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. బక్రీద్ పండగ పర్వదినాన ప్లాస్మా దానం చేయడం మతసామరస్యానికి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న పోలీస్ సిబ్బందిలో ఒకరైన సాయికుమార్ కు కరోనా సోకి పూర్తిగా కోలుకున్నాడు.
గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహ్మద్ యూసుఫ్ కరోనాతో బాధపడుతున్నారని అత్యవసర చికిత్స కోసం ఏబీ-పాజిటివ్ ప్లాస్మా అవసరమనే ప్రకటనను శనివారం సోషల్ మీడియాలో చూశారు. తనదీ అదే బ్లడ్ గ్రూప్ కావడంతో వెంటనే అక్కడికి వెళ్లి ప్లాస్మా దానం చేశారు. ఆ తర్వాత యూసుఫ్ ఎస్ఐ అని తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బక్రీద్ పండగ రోజు ఓ ముస్లిం సోదరుడికి ఓ హిందువు ప్లాస్మా దానం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు. చంద్రాయణగుట్ట సీఐ రుద్రభాస్కర్, డీఐ కె.ఎన్.ప్రసాద్ వర్మ, ఎస్ఐలు, గచ్చిబౌలి సీఐ జగదీశ్వర్ రావు సాయికుమార్ ను అభినందించారు.