Mother In Law Corona : అమానవీయం.. కోడలికి కరోనా అంటించి ఇంటి నుంచి గెంటేసిన అత్త
మనుషుల్లో మానవత్వం కనుమరుగు అవుతోంది. బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. కోడలికి కరోనా అంటించడమే కాదు.. ఇంటి నుంచి బయటకు గెంటేశారు.
- Naveen
- Published On : May 31, 2021 / 07:29 AM IST
Mother In Law Corona
Mother In Law Corona : మనుషుల్లో మానవత్వం కనుమరుగు అవుతోంది. బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. కోడలికి కరోనా అంటించడమే కాదు.. ఇంటి నుంచి బయటకు గెంటేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల క్రితం ఒడిశా వెళ్లాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
కాగా, 5 రోజుల క్రితం ఆమె అత్త కరోనా బారినపడి హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతోంది. వ్యక్తిగత దూరం పాటించడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది. ‘నేను చనిపోతే మీరు హాయిగా బతుకుతారా’ అంటూ కోడలిపై ద్వేషం పెంచుకుంది. ఈ క్రమంలో శాడిస్ట్ లా మారిపోయింది. కోడలిని తరచూ ఆలింగనం చేసుకుంది. అంతేకాదు ఆమె పిల్లలను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం చేసింది.
దీంతో కోడలికి సైతం మూడు రోజుల కిందట కరోనా సోకింది. దీంతో అత్తమామలు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. ఆమె చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూపలేదు. ఈ విషయం తెలుకున్న బాధితురాలి సోదరి ఆమెను చేరదీసింది. రాచర్ల గొల్లపల్లిలోని తన సొంతింటికి తీసుకొచ్చి హోం క్వారంటైన్లో ఉంచింది. తనకు కరోనా సోకడానికి అత్తే కారణం అని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోడలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అత్తమామల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
