Narayana Kankanala (Photo : Twitter)
Narayana Kankanala – Narendra Modi : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విరుచుకుపడ్డారు. కొత్తగూడెంలో సీపీఐ ప్రజా గర్జన సభలో నారాయణ నిప్పులు చెరిగారు.
దేశంలో ధరలు మోదీ గడ్డం పెరిగినట్లు పెరుగుతున్నాయని నారాయణ విమర్శించారు. లక్ష కోట్లు రైతులకు ఇవ్వలేకపోతున్నారు. కానీ, వ్యాపారస్తులకు రూ.14లక్షల కోట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. మరో 13 నుండి 14 కోట్ల రూపాయలు వివిధ వ్యాపారస్తులు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారని అన్నారు. అదానీ, నరేంద్ర మోదీ ఇద్దరూ కవల పిల్లలు లాంటి వారని, తనకు పిల్లలు లేరనే మోదీకి 30మందికి పైగా వ్యాపార దత్తపుత్రులు ఉన్నారని నారాయణ చెప్పారు.
” ఇది ఎన్నికల బహిరంగ సభ అని విమర్శించాలని చూస్తున్నారు. అయినా ఎన్నికల సభ అయితే తప్పేముంది? మేము సన్యాసులం కాదు కమ్యూనిస్టులం. కమ్యూనిస్టులు ఎన్నికల సభ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే చట్ట సభల్లో అడుగుపెడితే అది ప్రజలకే మంచిది. బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే ప్రయత్నమే బీఆర్ఎస్ తో దోస్తీ.
Also Read..Bandi Sanjay : బీఆర్ఎస్ ను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనే : బండి సంజయ్
కేసీఆర్ కూడా చాలా తప్పులు చేస్తున్నారు. దళితబంధు ఎంతమందికి ఇచ్చారు? మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చారు? పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారు? కాంట్రాక్ట్ కార్మికులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలను పరిష్కరించలేదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై మేము పోరాటం చేస్తూనే ఉంటాము. రాజకీయ సఖ్యత ఉండాలి కానీ ఓట్ల ప్రాతిపదికన పొత్తులు ఉండకూడదు. ఓట్ల లెక్కను తీసుకుని సీట్ల సర్దుబాటు అని కాలయాపన చెయ్యొద్దు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు నడ్డా వచ్చాడు. ఈ నాలుగేళ్లలో బిజెపికి జగన్ కట్టు బానిసలాగా ఉన్నారు. అయినా జగన్ ను సభలో ఉతికి పడేశారు. బీజేపీకి అధికారమే పరమావధి. సీబీఐ లాంటి పెంపుడు కుక్కలతో బెదిరించి అధికారంలోకి రావాలని కేంద్రం చూస్తోంది. తెలంగాణలో మాత్రం కమ్యూనిస్టు పోరాటాలు ఉధృతంగా ఉంటాయి కాబట్టి బీజేపీ పప్పులు ఇక్కడ ఉడకవు. డబ్బులు సంకలో పెట్టుకుని జిల్లాలో రాజకీయం చేయాలని చూస్తున్నారు’ అని నారాయణ అన్నారు.