బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు.. బీజేపీలోకి వెళ్తారు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan: ఆ తర్వాత ప్రజా దర్బార్ ను నిర్వీర్యం చేశారని దాసోజు శ్రవణ్ విమర్శించారు.

Dasoju Sravan Slams CM Revanth Reddy

Dasoju Sravan: బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్రేలాడుతూ.. రేవంత్ రెడ్డి మోదీ ఏజెంట్ అని ఆరోపించారు. ఏదో ఒకరోజు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారని దాసోజు శ్రవణ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అడుగుతున్నారని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పంట పొలాలను ఎడబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిదని విమర్శించారు. ప్రజాదర్బార్ పేరుతో ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్ లో కూర్చున్నారని చెప్పారు.

ఆ తర్వాత ప్రజా దర్బార్ ను నిర్వీర్యం చేశారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డికి ఎటువంటి అవగాహన లేదని చెప్పారు. వయనాడ్ లో రాహూల్ గాంధీని గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, కేరళ ప్రజలు తెలివైన వాళ్లని, ఎవరికి ఓటు వెయ్యాలో వాళ్లకి బాగా తెలుసని అన్నారు.

డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే సంస్కృతి రేవంత్ రెడ్డిదని దాసోజు శ్రవణ్ చెప్పారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ వెళ్లి కనీసం చూడలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? గొర్రెల కాపరినా? అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కంచెలాగా రేవంత్ రెడ్డి కాపాడుకునేది ఏంటని ప్రశ్నించారు.

Also Read: వారు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారు: సజ్జల

ట్రెండింగ్ వార్తలు