Omicron Corona Virus : తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్. శ్రీనివాస్రావు చెప్పారు. టిమ్స్ ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్ధితి కుదుట పడుతోందని ఆయన తెలిపారు. మొదటి వేవ్లో హాస్పటల్లో చేరి చాలా మంది భయంతో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని….ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.
ఒమిక్రాన్ పట్ల అసత్య ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీనోమ్ సీకెన్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఈరోజు సాయంత్రం వరకు వస్తాయని… కోవిడ్ సోకిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలకు వెళ్లి చికిత్స చేసుకోవాలని ఆయన కోరారు. మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో వున్నాయని. ఓమిక్రాన్ అని తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ ఒకటే మార్గమని ఆయన తెలిపారు.
ఫ్రంట్లైన్ వర్కర్లకు మరొక బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని శ్రీనివాసరావు చెప్పారు. చిన్న పిల్లలకు వాక్సినేషన్ ఇచ్చే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామని ఆయన అన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని కోరారు.
Also Read : Suspicious Death : విశాఖ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి
సౌత్ఆఫ్రికాలో ప్రతి నలుగురిలో ఒక్కరికే వాక్సినేషన్ జరిగిందని….అందుకే అక్కడ కొత్త వేరియేంట్ పుట్టుకు వచ్చిందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో లోక్డౌన్ పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఓమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది కానీ, ఓమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు వుండటం లేదని ఆయన తెలిపారు. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయి. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవని ఆయన వివరించారు.
కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోటానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉందని ఆయన చెప్పారు. తప్పుడు వార్తల వల్ల వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం తగ్గుతుందని….. కోవిడ్ రోగులను దాచలేమని… ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తామని శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. కోవిడ్ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరమైనవని… తప్పుడు వార్తలతో కొందరు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారు. ఇది సరైనది కాదని ఆయన హితవు పలికారు.