Earthquake: తెలంగాణలో భూకంపం.. ఆందోళనలో జనం
ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. భూమి కంపించింది. జనాలు భయాందోళనలకు గురయ్యారు.
- Ravikanth 10tv
- Published On : October 31, 2021 / 08:43 PM IST
Earth
Earthquake: ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. భూమి కంపించింది. జనాలు భయాందోళనలకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో భూమి కంపించింది. ఈ సాయంత్రం 6.48 గంటలకు 3 సెకన్లపాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.3 గా తీవ్రత నమోదైనట్టు తెలుస్తోంది. జిల్లాలోని వేమనపల్లి మండలం గొర్లపల్లి గ్రామంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. బెల్లంపల్లిలో ఓ సెకన్ పాటు భూ కంపంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
కుమురంభీం జిల్లా కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల పరిధిలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ కూడా 4.3 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నిజామాబాద్ కు 199 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
సడన్ గా వచ్చిన భూ ప్రకంపనలతో ఆయా ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఏం జరుగుతోందో అర్థం కాక ఆందోళనలతో ఇళ్లు వదిలి బయటికి పరుగు పరుగున వెళ్లారు. ఇళ్లలో సామాన్లు కిందపడడం చూసి కంగారుపడ్డారు. కాసేపటికి సాధారణ స్థితి నెలకొన్నాక.. తిరిగి ఇళ్లలోకి వెళ్లారు. మరోవైపు… భూ కంపానికి గల కారణాలను అధికారులు విశ్లేషించే పనిలో ఉన్నారు.
