Eatala Rajender
Eatala Rajender – CM KCR : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని మార్చేసింది. అలాగే పలువురు నేతలకు కీలక పదవులు ఇచ్చింది.
బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఇక బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించారు. తనకు పదవి ఇవ్వడంపై ఈటల స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారాయన.
కేసీఆర్ ను ఓడించేందుకే తనకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తనకున్న అనుభవంతో, రాష్ట్రంలో తనకున్న పరిచయాలతో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఈటల స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఏ నమ్మకంతో హైకమాండ్ తనకు పదవి ఇచ్చిందో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటాను అన్నారు.
” తెలంగాణ ప్రజలు కేసీఆర్ నుండి విముక్తి కావాలని కోరుకుంటున్నారు, ఆ బాధ్యతను నాకు అప్పగించారని భావిస్తున్నా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చిందంటేనే బీఆర్ఎస్ తో బీజేపీ ఢీకొనేందుకు సిద్ధమైందని సంకేతం. బీజేపీ ఏది పడితే అది హామీ ఇవ్వదు. ఉన్నంతలో ప్రజలకు మంచి చేసే పని చేస్తుంది. 2018 ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వారికిచ్చిన హామీని కేసీఆర్ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాల్సిన అవసరం ఉంది’ అని ఈటల రాజేందర్ అన్నారు.