ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు సంస్థల దూకుడు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..నెక్ట్స్ అరెస్టేనా?

ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంతలోపే రిప్లై అఫిడవిట్ వేసిన కేటీఆర్..లావాదేవీలతో తనకేం సంబంధం లేదని అన్నారు.

ఫార్ములా ఈ-కారు రేసు కేసు తెలంగాణ గట్టు మీద హీట్ క్రియేట్ చేస్తోంది. ఓవైపు ఏసీబీ..ఇంకోవైపు ఈడీ దూకుడు పెంచుతున్నాయి. లేటెస్ట్‌గా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7న విచారణకు రావాలని పిలిచింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్.

అంతేకాకుండా ఈ కేసులో ఏ-2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ-3లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వారిని జనవరి 2, 3 తేదీల్లో ఈడీ విచారించనుంది. ఏసీబీ FIR ఆధారంగా ప్రివెన్షన్ మనీలాండరింగ్ యాక్ట్‌ కింద ఈడీ విచారణ జరుపుతోంది.

మరోవైపు ఏసీబీ ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఫార్ములా ఈ- కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ..కేటీఆర్ ఇప్పటికే హైకోర్టుకెళ్లారు. ఈ కేసులో ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సేమ్‌టైమ్‌ హైకోర్టులో రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు కేటీఆర్.

నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ
ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్‌దే అని కేటీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అయితే ఫార్ములా ఈరేస్ కేసులో ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసులు నమోదు చేయటంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శిబిరంలో హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ దోస్తీ రాజకీయాలు చేస్తూ..కేటీఆర్‌పై కుట్ర చేస్తున్నాయని విమర్శిస్తోంది.

ఏసీబీ కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఈడీ ఎంట్రీ ఇవ్వటమే ఇందుకు ఎగ్జాంపుల్ అని చెబుతోంది. ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తామని..ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని వాదిస్తోంది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.

ఇది నిజం కాదని చెప్పేందుకే ఈడీ కేసులో..కేటీఆర్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు ముందు కవితను ఈడీ అరెస్ట్ చేసి..ఐదు నెలల పాటు జైలులో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ కారు రేస్‌లో ఇటు ఏసీబీ విచారణ, మరోవైపు ఈడీ ఎంట్రీతో సంచలన పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

మంగళవారం హైకోర్టు ఏం తేల్చబోతుంది?
ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంతలోపే రిప్లై అఫిడవిట్ వేసిన కేటీఆర్..లావాదేవీలతో తనకేం సంబంధం లేదని తేల్చేశారు. ఇక న్యూఇయర్‌లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ మీద మంగళవారం హైకోర్టు ఏం తేల్చబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదిస్తే ఓకే. లేకపోతే బెయిల్ వస్తుందా లేదా అన్న డైలమాలో ఉన్నారు గులాబీ నేతలు.

ఇక జనవరి 7న ఈడీ విచారణకు పిలిచింది. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది కూడా ఇంకో చర్చ. ఈడీ విచారించి వదిలేస్తుందా లేక కేటీఆర్‌ను అరెస్ట్‌ చేస్తుందా అనేది మరో డిబేట్. ఏదైనా ఎట్‌ ఏ టైమ్‌ రెండు దర్యాప్తు సంస్థలు..ఒకే ఇష్యూలో పలురకాలకు దర్యాప్తు చేస్తుండటం గులాబీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. అయితే న్యాయపోరాటం ద్వారే గెలిచి చూపిస్తామని..కేసులు, నోటీసులు, అరెస్టులకు భయపడేది లేదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. న్యూఇయర్‌లో ఎలాంటి బ్లాస్టింగ్‌ న్యూస్ రాబోతుంనేది వేచి చూడాలి మరి.

తన తండ్రిని బంధువులు హేళన చేస్తుండగా విన్న నితీశ్ కుమార్‌.. అందుకే ఇప్పుడు బాహుబలి స్టైల్‌లో సెలబ్రేషన్స్‌