Work From Home : వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి.. పెరుగుతున్న డిమాండ్..

Work From Home Demand: పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు ఎండలు కూడా మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

Employees Demanding Work From Home Amid Petrol Diesel Shortage

Work From Home : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా చేసే పెట్రోల్, డీజిల్ నిబంధనలు మార్చడంతో చాలా రాష్ట్రాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. ఏపీతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేదిస్తోంది. బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర మవుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.

Also Read : ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఉచితంగా పెట్రోల్.. ఏపీలో ఇక్కడ బంకుల వద్ద వాహనదారుల బారులు

గతంలో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ సమయంలో ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇచ్చాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించి పోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు ఎండలు కూడా మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల తరువాత బయటకు వచ్చేందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.


పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైతే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, లాక్ డౌన్ కంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోం విధానం వల్ల పెట్రోల్, డీజిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడంతోపాటు ఎండల నుంచి రక్షణ పొందొచ్చని, మరోవైపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టొచ్చని, పొల్యూషన్ తగ్గుతుందని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.