శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు: ఎర్రబెల్లి స్పందన
Errabelli Dayakar Rao: పార్టీ మారాలని తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. తాను పార్టీ..
- T Venkateshwarlu
- Updated on- March 26, 2024 / 12:47 PM IST
Errabelli
తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డికి శరణ్ చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేశారని శరణ్ చౌదరి అన్నారు. డీజీపీకి కూడా దుబాయ్ నుంచి ఆన్ లైన్ ద్వారా శరణ్ ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని ఎర్రబెల్లి అన్నారు. శరణ్ చౌదరి చేసిన మోసాల వల్ల బీజేపీ ఆయనను సస్పెండ్ చేసిందని చెప్పారు. ఎన్ఆర్ఐలను మోసం చేసినట్లు చౌదరిపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.
ఇలాంటి ఫిర్యాదులు చౌదరిపై ఎన్నో ఉన్నాయని ఎర్రబెల్లి తెలిపారు. తాను భూవివాదాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని తెలిపారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసి కొందరు లబ్ధిపొందాలని చూస్తున్నారని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి విచారణ జరగాలని ఎర్రబెల్లి అన్నారు. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీ మారబోనని తెలిపారు. గతంలో కూడా తనపై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని చెప్పారు. తాను ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని, దేనికైనా నేను రెడీ అని తెలిపారు.
