Etela Rajender: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొద్ది గంటల్లో బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీకి వెళ్లనున్న ఆయన… బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఈటల.. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత.. తన నియోజకవర్గం హుజూరాబాద్లో అనుచరులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరిగాయి. బీజేపీలో చేరేదెప్పుడు అనే విషయంపై ఓ రేంజ్లో చర్చలు జరిగాయి. వాటన్నింటికీ పుల్స్టాప్ పెట్టిన ఈటల.. బీజేపీలో అధికారికంగా చేరనున్నారు. ఆయనతో పాటు… హుజురాబాద్ నియోజకవర్గ నాయకులతో పాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు కూడా కమలం గూటికి చేరనున్నారు. ఈటల రాజేందర్, అతని అనుచరులతో పాటు.. లక్ష్మణ్, డీకే అరుణ, సోయం బాపూరావు, వివేక్, మురళీధర్రావు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆపార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈటల చేరిక అనంతర పరిణామాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. బండి సంజయ్, కిషన్రెడ్డి, జేపీ నడ్డా భేటీ తర్వాత ఈటల బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటలతో పాటు.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి సహా.. మరికొందరు నాయకులు.. కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో చేరిన అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే ఘన స్వాగతం పలికేందుకు ఈటల అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఈటల చేరికకంటే ముందే హైప్ క్రియేట్ చేసిన కమలం పార్టీ నేతలు.. ముందు ముందు ఉద్యమకారులను తమవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
Read More : French Open: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్