నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు మృతి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.
- Harishth Thanniru
- Published On : August 11, 2024 / 08:26 AM IST
Road Accident
Road Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో రావడమేనని తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు టిప్పర్ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గంటలపాటు శ్రమించి గాయపడిన వారిని కారులో నుంచి బయటకు తీశారు.
గాయపడిన వారిలో ముగ్గురు ఇంజనీర్స్ ఉన్నారు. గచ్చిబౌలి నుండి నార్సింగ్ మైహోమ్ అవతార్ మీదుగా ప్రయణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న సిరి, గౌతమ్, సుదీప్ లకు తీవ్ర గాయాలు కాగా.. టిప్పర్ లారీ డ్రైవర్ సతీష్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మంచిర్యాల నుంచి గోదావరిఖనికి బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆలిగడ్ కు చెందిన సత్తేందర్, దేవుకుమార్ అక్కడికక్కడే మరణించారు. మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్ లో వీరు పనిచేస్తున్నారు.
