Fire Accident: హైదరాబాద్లోని బోయిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. శాద్వన్ స్క్రాప్ గోడౌన్లో చెత్త కాగితాలు ప్లాస్టిక్ కాలి మందు బాటిళ్లు సామాన్లు ఉండడంతో మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో గోడౌన్లో 12 మంది ఉండగా ఒకరు తీవ్ర గాయాలతో బయటపడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. అర్థరాత్రి 2 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాసేపటికే స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 8 ఫైరింజన్లతో.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉదయం ఐదున్నర గంటలవరకు మంటలు అదుపు చేశారు.
కాగా.. చనిపోయిన వారి ఆచూకీ కోసం ఉదయం 8 గంటల వరకూ గాలించారు. 11 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో టింబర్ డిపోలో ఉన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. సెంట్రల్ జోన్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను బిహార్ కు చెందిన వారిగా గుర్తించారు.
Read Also: కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన సైక్లింగ్ పార్క్ గోదాం