Former MLA Balka Suman
Balka Suman : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. సమన్ తోపాటు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి విడుదలయ్యారు. జైలు బయట వారికి మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మంచిర్యాల, చెన్నూరు కోర్టుల్లో బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఉదయం అదిలాబాద్ జిల్లా జైలు నుంచి వారు బయటకు వచ్చారు.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక పథకాల అమలు వారికి మాత్రమే.. కలెక్టర్లకు ఆదేశాలు
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్, ఆయన కొడుకు బీఆర్ఎస్, సీపీఐ 14 మంది కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్కు కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి హంగామా సృష్టించారని, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యం చేశారని అన్నారు. మాపై మంత్రి వివేక్ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారంటూ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ మొదలు తహసీల్దార్ వరకు అంతా మంత్రి వివేక్ విశాఖ కంపెనీ ఉద్యోగులుగా మారిపోయారని బాల్క సుమన్ ఆరోపించారు. చెన్నూర్ మున్సిపాలిటీలో మేము ప్రజా తీర్పును గౌరవించాం. క్యాతన్ పల్లిలో మీరెందుకు ప్రజా తీర్పును గౌరవించరు అంటూ ప్రశ్నించారు. చెన్నూర్లో 45వేల ఉద్యోగాలిస్తామన్న మంత్రి వివేక్ ఎన్నికల హామీ ఏమైందని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఒక్క మున్సిపాలిటీ కోసం ఆ ప్రాంతాన్ని మంత్రి వివేక్, సీఎం రేవంత్ రణరంగంగా మార్చారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.