Former Telangana Congress leader P Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహుర్తం కూడా దాదాపుగా ఫిక్స్ చేసుకున్న కౌశిక్ రెడ్డి, బుధవారం(21 జులై 2021) మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, మద్దతుదారుల కోరిక మేరకు టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పిన కౌశిక్ రెడ్డి, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం, లోయర్ మానేరు ప్రాజెక్టులతో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుబంధు పథకం ఈ నియోజకవర్గం నుంచే అమలైనట్లు చెప్పుకొచ్చారు.
తనను అభిమానించే నాయకులు, కార్యకర్తులు, అభిమానులు అందరూ రేపు(21 జులై 2021) టీఆర్ఎస్ భవన్కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ ఏడేళ్లుగా మంత్రిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్లో నెంబర్ 2గా ఉంటూ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారని అన్నారు. ఈటల దేనికోసం రాజీనామా చేశారు. తన అవినీతి ఆరోపణలపైనే కదా? అని ప్రశ్నించారు.
ఈసారి హుజురాబాద్ ప్రజలు.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఓటు వేస్తారని అన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే, అన్నీ వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు కౌశిక్ రెడ్డి. ఈటలను పద్దెనిమిదేళ్లుగా గెలిపించారు. ఈ ఒక్కసారి రెండేళ్లు కోసం తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు కౌశిక్ రెడ్డి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోతే, 2023లో టీఆర్ఎస్కు ఓటు వేయకండి అని అన్నారు.